Monday 18 May 2015

పాపి కొండలు

అందమైన గోదావరిమీద బోటులో ఉదయం 9-00 గంటలనుంచి సాయంత్రం 6-00 గంటలదాకా గడపటమంటే ఇష్టపడని వాళ్ళుంటారా? అయితే మీరు గోదావరి జిల్లాలోని పాపికొండలు చూసేవుంటారు. ఇంకా చూడలేదా అదేమిటండీ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ కొండలలో సగందాకా మునిగిపోతాయి.. మన రాష్ట్రంలో వుండి, కనుమరుగు కాబోతున్న ఈ అందాలను మనం చూసి ఆ ఙాపకాలను పదిలపరుచుకుని మన వారసులకు అందివ్వాలికదా. అయితే వెంటనే బయల్దేరండి.
రాజమండ్రిలో ఈ ప్రయాణానికి ఏర్పాటు చేసే టూరిస్టు అఫీసులు వున్నాయి. ఎ.పి. టూరిజం వారు కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాదు నుంచి కూడా రిజర్వు చేసుకోవచ్చు. ఈ ప్రయాణం రెండు రకాలు. మొదటిది ఉదయం 7-30 కి బయల్దేరి మళ్ళీ రాత్రి 8-00 గం. కి తిరిగి వచ్చేది. ఇందులో వెళ్ళేటప్పడు గంటన్నర వచ్చేటప్పడు గంటన్నర బస్సు ప్రయాణం వుంటుంది. ఇది ట్రావెల్ ఏజెంట్సే ఏర్పాటు చేస్తారు. ఛార్జీలు టికెట్ లోనే కలసి వుంటాయి. టికెట్ ఒక రోజుకి మనిషికి 650 రూ.లు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం టీ కూడా ఈ టికెట్ ఖరీదులోనే లాంచీలో ఏర్పాటు చేస్తారు. స్నాక్స్, కూల్ డ్రింక్స్ లాంచీ కేంటీన్ లో కొనుక్కోవచ్చు. మరి రెండవ ప్రయాణం బాంబూ కేటేజీ లలో రాత్రి బస. మర్నాడు పిక్ అప్ .ఇది అన్నీ ఏర్పాట్ల తో కలిపి మొత్తం రెండు వేలు ఒక్కఒక్కరికి.
ఉదయం 7-30 కి రాజమండ్రి లోని .రైల్వే స్టేషన్ వద్ద మమ్మల్ని పిక్ అప్ చేసుకున్నా బస్ లో
బయల్దేరి 9-00కి పట్టిసం అనే వూరు చేరుకున్నాము. ( ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయం చాలా ప్రసిధ్ధి చెందింది కానీ ఒక రోజు ప్రయాణంలో ఈ దేవాలయ దర్శనం లేదు. దీని కోసం కొంత దూరం పడవ ప్రయాణం తర్వాత కొంత నడక వుంటుంది.) జానికి రాముడు సినిమా చిత్రీకరణ ఇక్క జరిగినది ఆట. పట్టిసం రేవులో లాంచీలు సిధ్ధంగా వున్నాయి. మేము రిజర్వు చేసుకున్న భగీరధ అనే లాంచీ ఎక్కాము. 9-10 కి భగీరధ బయల్దేరింది. లాంచీ లోనే అల్పాహారం సర్వే చేశారు. . మేము పైన డెక్ మీదకెళ్ళి కూర్చున్నాము. గైడు ముందుగా ఆందరినీ పరిచయం చేసుకుంటూ మైకుతో సహా క్రిందా, డెక్ మీదా కలియ తిరిగుతూ హుషారు చెయ్యటం మొదలు పెట్టాడు. చుట్టుప్రక్కల ప్రదేశాల వివరాలు, విశేషాలు చెప్పటమేగాక కబుర్లు, జోక్సు, డాన్సులతో ప్రయాణమంతా హుషారుగా వుండేటట్లు చేశాడు.
నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి 1600 కి.మీ.లు ప్రయాణంచేసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ రోజు గోదావరి మీద మా ప్రయాణం 65 కి.మీ.లు. రాజమండ్రి దగ్గర 5 నుంచి 6 కి.మీ.ల వెడల్పు వుండే గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 500 మీటర్ల వెడల్పు మాత్రమే వుంటుందిట.
రామయ్యపేట దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయింది. గోదావరికి ఒక గట్టుమీద వున్న రామయ్యపేటనుంచి ఇంకో గట్టుమీద వున్న చిన్న కొండదాకా డామ్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే 235 గిరిజన గ్రామాలు, పాపి కొండలు సగం 100 అడుగుల పైగా మునిగిపోతాయట. 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందటమేగాక విద్యుదుత్పాదన కూడా జరుగుతుంది.
కుడివైపు దెందూరు అనే గ్రామం దగ్గర లాంచీ మొదటి సారి ఆగుతుంది. ఇక్కడ గట్టుమీద వున్న గండి పోచమ్మ అమ్మవారి దర్శనార్ధం 15 ని. ల సమయం ఇస్తారు.
.ఇక్కడి నుండి అన్నీ సెల్ సిగ్నల్స్ మాయం అవుతాయి . కేవలం కేమారాలు గా మారి పోతాయి. అందరూ ఈ విషయం గురించి జాగర్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
దైవ దర్శనం తర్వాత సినిమా కబుర్లు. గట్టు మీద కనిపించే పూడిపల్లి అనే వూళ్ళో పల్లెటూరు వాతావరణం వున్న సినిమాలు తీస్తారుట. త్రిశూలం సినిమాలో రావు గోపాలరావు ఇల్లు గట్టుమీద కనిపిస్తుంది. ఇంకా అందాల రాముడు, ఆట, ఆపద్బాంధవుడు, ఇలా ఎన్నో సినిమాలు అక్కడ రూపు దిద్దుకున్నాయి. తర్వాత దేశ భక్తి, చరిత్ర. అల్లూరి సీతారామరాజు చరిత్రలో వినిపించే దేవీ పట్నం లోని పాత, క్రొత్త పోలీసు స్టేషన్లను చూస్తాం. గట్టు మీద కనిపించే రెండు గులాబీ రంగు భవనాలు కొత్త పోలీసు స్టేషను, క్వార్టర్లు .. వాటి మధ్య కనిపించే పాత పెంకుటిల్లు బ్రిటిషు కాలంనాటి పాత పోలీసు స్టేషను.
దేవి పట్నం వద్ద లాంచీ లో సెర్వ్ చేయటానికి బోజనాలు లాంచీ లోకి తెస్తారు.
కొండ మొదల అనే ఇంకో గ్రామం గురించి గైడు చెప్పిన సంగతి వింటే వెంటనే ఆ వూరు వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళటానికి రోడ్లు వగైరాలేమీ లేవు. ఇంకో విశేషం అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే ఇప్పటికీ బార్టరు సిస్టమే అంటే వస్తువులిచ్చి పుచ్చుకోవాల్సిందేగానీ, మీ డబ్బులక్కడ చెల్లవు.
ఇంత వెనుకబడిన గ్రామం తర్వాత వచ్చేది కొరుటూరు. ఇక్కడ ఎ.సి. నాన్ ఎ.సి. కాటేజస్ వున్నాయి. కావాలంటే ట్రావెల్స్ వాళ్ళని అడగండి.
ఇన్ని గ్రామాలను గురించి తెలుసుకుంటూ లాంచీలో జరిగే నాట్య ప్రదర్శనలు తిలకిస్తూ పాపికొండలు చేరేలోపల భోజనాలు పూర్తి చేశాము ఆ అందాలను గుండెనిండా నింపుకోవటానికి ఏ ఆటంకమూ వుండకుండా.. ప్రకృతి సోయగాలను ఇనుమడింపచేసి చూపించటానికి వరుణదేవుడు మద్యాహ్నం పలకరించి వెళ్ళాడు.. వానలో తడుస్తున్నా ఆ అనుభూతులెక్కడ కోల్పోతామోనని చాలామంది డెక్ మీదే వుండిపోయారు .
ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో బాగంగా, ఒక వృద్ద జంట కి మళ్ళీ పెళ్లి , యవ జంటలతో , దూయట్లు, నడివయస్కులకి పాప్ సాంగ్స్, పిల్లల తో లుంగీ డాన్స్ లతో బాగా ఆహ్లాద పరిచారు. చుట్టూ ఉన్న అందాల తో పాటు. ముగ్గురు డెన్సర్ లు చేసిన హింది సాంగు కి నృత్యం అద్భుతం.
మా తరువాత మజిలీ పేరంటపల్లి, శ్రీ రామకృష్ణ మునివాటము అందులోని శివాలయం. లాంచీలో గైడు ముందే అక్కడ పాటించాల్సిన నియమాలు చెప్పాడు. గిరిజనులచే నిర్వహింపబడుతున్న ప్రదేశమని, అక్కడ వారికి సహాయం చేసే ఉద్దేశ్యం వుంటే ఆశ్రమ ప్రచురణలు కొనాలి తప్ప వేరే డబ్బు, వస్తువులు ఇస్తే వాళ్ళు చాలా బాధపడతారని. ఆ ఆలయం చాలా శక్తివంతమైనదవటంవల్ల అక్కడ తగుమాత్రమే మాట్లాడాలి అదీ మంచిమాటలే. ఇక్కడ పూజారి వుండడు, పూజకు సంకల్పం కూడా ఎవరూ చెప్పకూడదు. సంకల్పం వల్ల సూర్య చంద్రాదుల సాక్షిగా కోరికలు వెలిబుచ్చటమవుతుంది. జన్మ రాహిత్యానికి ఈ సంకల్పము ప్రతిబంధకమని ఇక్కడ నమ్మకం. దేవునికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మాత్రం ఆశ్రమంలో వండిన పదార్ధాలే పెట్టాలి. శుచి, శుభ్రత కోసం. పాలు, పళ్ళు, కొబ్బరికాయలు, ఎవరి ఇష్టం వారిది. అయితే వాటిని వినియోగించే బాధ్యత కూడా వారిదే. ఈ దేవాలయం చేరుకోవటానికి కొంచెం దూరం కొండమీదకి ఎక్కాలి. ఇక్కడ మాకిచ్చిన సమయం అర్ధగంట.ట్రైబల్ మహిళలు చేసిన వెదురు బొమ్మలు కొనకుండా అక్కడ నుండి రావటం కుదరదు అంతా అద్బుతంగా ఉంటాయి మీరు కొనలేదు అంటే రవాణా కష్టం గురించే. పాకింగ్ కి సరైన ఏర్పాట్లు ఉంటే అమ్మకాలు బాగా పెరుగుతాయని పిస్తుంది. దేవాలయానికి వడ్డాణం లాగా కొందలనుండి ప్రవహించే జలపాతం లో ఫోటోలు తీసుకోకుండా మనం అక్కడి నుండి కదలలేము.
ఇక్కడనుంచి మధ్యాహ్నం 2-45 కి తిరుగు ప్రయాణం మొదలు పెట్టి సాయంత్రం 3-30 కి కల్లూరు ట్రైబల్ విలేజ్ చేరాము. మమ్మల్ని అక్కడ దించిన భగీరధ మర్నాడు అదే సమయానికి పిక్ అప్ చేసుకుంటామని చెప్పి మమ్మల్ని అంధరిని దించి వెళ్లారు.
హోలీ మొదలయ్యింది.................ఇంకా ఉంది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...