Friday 28 August 2020

www.susri.home.blog

 అందరికీ నమస్తే

66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను. 

వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify చేస్తూ మరో బ్లాగ్ ని 16 ఆగస్ట్ 2020 న ప్రారంభించాను. 

FB లో పోస్ట్ ల లైఫ్ తక్కువ. కొన్నాళ్ళ తర్వాత వ్రాసిన పోస్ట్ వెతుక్కోవటం కూడా అంత ఆషామాషీ వ్యవహారం కాదు. 

అందుకే ఏం వ్రాసినా కొత్త బ్లాగ్ లో వ్రాయాలని అనుకుంటున్నాను. 

ఇందులో పోస్ట్ లు కూడా ఎడిట్ చేసి కొత్త బ్లాగ్ లో పుబ్లిష్ చేస్తున్నాను. ముఖ్యంగా నా అల్ టైమ్ ఫవేరేట్ "33 గ్రేడ్"

కొత్త బ్లాగ్ కి మీకు ఆహ్వానం.    www.susri.home.blog      

Saturday 9 May 2020

పురుగు


హాల్లోకి ఎనిమిదేళ్ళ పాప బెరుకు లేకుండా వచ్చింది.
టేబుల్ మీద ఉన్న స్వీట్స్ ని చేయి చాచి అందుకో బోయింది.
వారిస్తున్న వారిని మందలిస్తూ దగ్గరకి తీసుకుని ముద్దు చేసాడు పురుషోత్తం.
“ఏం పేరు బుజ్జి?”
“నీరద”
"బావుంది." పాపని వళ్ళో కూర్చోబెట్టుకోబోతుంటే బార్య చిన్నగా దగ్గింది.
ట్రే లో కాఫీ కప్పులతో ‘సుజాత’ హాల్లోకి వచ్చింది.
అందరికి కాఫీ గ్లాసులు అందించి తండ్రి పక్కనే కూర్చుంది.
పురుషోత్తం కాఫీ చప్పరిస్తున్న కొడుకుని గమనించాడు.
అతని మొహం లో చిన్న సంతోషం.
కొద్ది క్షణాలు మౌనంగా దొర్లాయి.
పెద్ద వాళ్ళు ఏవో సంభందం లేని విషయాలు మాట్లాడుకుంటూ ‘ఇద్దరినీ’ గమనిస్తున్నారు.
“అబ్బాయితో ఏమయినా మాట్లాడాలంటే చెప్పమ్మా.” పురుషోత్తం సుజాత కట్టు కున్న చీర ని గమనిస్తూ పెద్దగా నవ్వుతూ అన్నాడు.
“నేను మీతో నే మాట్లాడాలి.”
ఒక్క నిమిషం అక్కడ నిశబ్దం.
“మాట్లాడమ్మా .. పెళ్ళయ్యాక అందరం కలిసే ఉంటాం. మాకు హైదరాబాదు లో కూడా ఇల్లు ఉంది. మీరు ఉద్యోగాన్ని బట్టి అక్కడయినా ఉండొచ్చు. మీ అత్తగారు నేను అప్పుడప్పుడూ వచ్చి .........”
“మీరు వరంగల్ జెడ్ పి స్కూల్ లో పని చేసారు కదా? “
పురుషోత్తం ఆశ్చర్యపోయాడు.
“అ వు ను”
“ఫిజికల్ సైన్సు చెప్పే వారు”
“నీ కేలా తెలుసు?”
“మా అమ్మాయి అక్కడే చదివింది.” సుజాత తండ్రి అందుకున్నాడు.
"ఓహ్ అలానా? మాస్టారిని ఇంకా మర్చి పోలేదన్న మాట ” మాస్టారి భార్య నవ్వింది. ..
“పసి పిల్లలని తాక కూడని చోట తాకి నరకం చూపించిన వీడిని అంత తేలిగ్గా మర్చిపోవటమా?” తమ్ముడూ.. ఇన్నాళ్ళు నేను పెళ్లి కి వప్పుకోక పోవటానికి కారణం అడిగేవాడివి కదా?”
పమిట మీది పురుగు ని విదిల్చుకుని నిలబడింది సుజాత.

పంది కొక్కు _ లాక్ డౌన్

మూడు రోజుల నుండి పంది కొక్కు సమస్య చర్చకి వస్తూనే ఉంది. మొదటి రోజు పప్పీలా గా ముద్దుగా ఉండే ప్రస్తావన, రెండో రోజుకి వేట కుక్క అయి మూడో రోజుకి చిరుత గా మారుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో కుండీలలో మట్టి తోడటం, మెట్లు మీద నానా చెత్త వదిలి పొద్దుటే శుబ్రం చేసుకోవాల్సిన అవసరం, మెయిడ్ మాత లేనప్పుడు సీసా లో నుండి వచ్చిన భాష తెలియని చైనీస్ పొగ భూతం లాటిది. ఇంటి నిండా ఇంజనీర్లే.. పంది కొక్కు సమస్య సెటిల్ చెయ్యలేని చదువులూ చదువులే.. అని అప్పుడో మాట.. ఇప్పుడో విసురూ .. శబ్దం చేసే గిన్నెలు.. విసురుగా మూసే తలుపులు.. హన్నా.. మీకు చెప్పెతంతటి వాడినా? రేయ్ సాయి యిటురారా.. యు ట్యూబ్ కొట్టు making a trap to trap a rat ఎట్సెట్రా .. ఒక ఇరవై లీటర్ల పాత పెయింట్ డబ్బా అటక మీద నుండి దించి, దాని మూతి కోసేసాం. మరో పల్చటి చక్క కి మద్య నుండి తాడు కట్టి రెండో చివర ఉల్లిపాయ వేలాడదీసాం. బరువు, వేగమూ గమనమూ, స్ప్రింగు పని తనమూ, మూత వ్యాసము, డబ్బా ఎత్తు, తిరుగు ప్రయాణం లో మూత కి అడ్డుగా పడే ప్రతిపాదిత మూత .. హన్నా.. డబ్బా లో బరువు కి ఇటుక రాళ్ళు పెట్టి బియ్యప్పిండి చక్కలు నాలుగు అందులో వేశాం. మార్స్ మీదికి వదిలే రాకెట్ ని ఈ సారికి మా పూల కుండీల మద్య సెట్ చేసి వచ్చి ఫ్రెష్ అయి కూర్చున్నాం. పంది కొక్కు అందులో పడుతుందంటావా? అంది మా ఆవిడ. అది వెజిటేరియన్ అయ్యి బియ్యపు చక్కలు వాసన, ఉల్లిపాయ అరోమా,, ఖాయం గా బెజ్జం లోకి దూరటం పైన మూత అడ్డు పడటం.. tappad అంతే.. tappad ఏమిటి? ఇప్పటి ట్రెండింగ్ వర్డ్ అది. అది వాడక తప్పదు. “ఇంతకీ ఆ పంది కొక్కు ? “ఇంకా అనుమాన పడింది. ట్రాప్ లోకి రాలేదా? ఉదయాన్నే ప్లాన్ –B అదేంటి? “గుమ గుమ లాడే నేతి గారెలు, అల్లం పచ్చడి. మనదే కాదు పక్కింది పంది కొక్కులు కూడా తోక ఊపుకుంటూ రావాల్సిందే” ఈ సారి thappad అనలేదే? అదే ఆలో చిస్తున్నాను. ఒక వేళ మన ఫ్రెండ్ వెజ్ కాదనుకో.. అప్పుడో పని చేద్దాం.. ప్లాన్ C నా? భలే కాచ్ చేస్తావు నువ్వు. కుడోస్ బాగా రెండు కేజిలు చందవా చేపలు తెచ్చి, సగం వేపుడు కూర మరో సగం తో పులుసు చేసి..నా సామి రంగా ఈ సారి తిరుగు లేదు. ఈ లోగా మా చిన్నమ్మాయి వచ్చింది. ఏంటి? ఎలక్కేనా. మెనూ ? కరెక్ట్ గా గుండమ్మ తో డీల్ ఫైనల్ అయ్యేటప్పుడు ఎంట్రీ ఇస్తుంది. రేయ్ సాయి అటక మీద మర చెంబూ కమండలం ఉంటాయి. వెతికి కిందకి దించు.. అవెందుకు? అంది ఇంటావిడ. శుబ్రం గా తోమి పెట్టు. పట్టు పంచ కట్టుకుని కమండలం లో నీళ్ళు తల్లీ కూతుళ్ళు ఇద్దరి మీద చల్లాననుకో... అదేదో .. ఆ పంది కొక్కు మీద చల్లోచ్చు గా .. చేతి తో టీ కప్పు లాక్కుని లోపలి వెళ్ళింది. .. శుభ రాత్రి. #సుశ్రీ

Tuesday 21 April 2020

ట్రైన్ వెళ్ళింది.

స్టేషన్ నుండి ట్రైన్ బయలుదేరిన రెండు నిమిషాలకి ఆ పిల్లాడు గేటు వద్ద నుండి లోపలి వచ్చి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్నాడు.
అతనికి దుఖం గా ఉంది. కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి.
“ఏమయింది బాబూ?” పక్కనే ఉన్న సాధువు ప్రశ్నించాడు.
ఆ పిల్లాడు తన కాళ్ళ వయిపు చూయించాడు.
ఒక కాలికి బూటు ఉంది. రెండో కాలికి మేజోడు ఒకటే ఉంది.
సాధువు మొహం లో ఇంకా ప్రశ్న ఉంది.
“ఏమయింది .. బాబూ?” మళ్ళీ అదే ప్రశ్న.
“రైలు ఎక్కుతుంటే ఒక బూటు జారి ఫ్లాట్ ఫారం మీద పడింది.
దిగి తీసుకునే లోపు ట్రైన్ కదిలింది.”
“ఎవరో పిల్లాడు కిటికీ వైపు చేత్తో బూటు పట్టుకుని పరిగెట్టడం చూసానే..”సాధువు అన్నాడు.
“అవును. కాయలు అమ్మే అబ్బాయి. బూటు నా వైపు విసిరాడు. నేను క్యాచ్ చెయ్యలేక పోయాను.”
పిల్లాడి దుఖం ఎక్కువయింది.
“ఆ కాయలబ్బాయి కి అసలు చెప్పులే లేవు గమనించావా?”
“అవును. వాళ్లకి ఉండవు. “
పిల్లాడు మళ్ళీ విచారం లోకి వెళ్లి పోయాడు.
“నీకు ఇంకో జత చెప్పులు లేవా? “
“ఉన్నాయి. ఇంకో జత బూట్లు కూడా. కానీ ఇవి కొత్తవి”
మరెందుకు బాధ పడుతున్నావు?
“ఇలా జరిగితే నువ్వు భాద పడవా?”

ఖచ్చితంగా బాధ పడతాను.
ఈ రెండో బూటు అతనికి అందేలా విసరనందుకు.

Thursday 16 April 2020

భగవాన్ కా రాస్తా

నారాయణి దేవి కి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు.
రెండో కుమార్తె కుటుంభం పాటియాలా లో ఉంటుంది.
పెద్ద కుమారుడు బార్యా ముగ్గులు పిల్లలతో, చిన్న కుమారుడు బార్యా. కొడుకుతోను, విదవరాలయిన పెద్ద కుమార్తె తన 33 ఏండ్ల అవివాహిత కుమార్తె తో ఉమ్మడిగా మిద్దె మీది ఇంట్లో ఉంటారు.
గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మూడు స్వంత షాపుల్లో ఫ్లై వుడ్ వ్యాపారం నిర్వహిస్తుంటారు. బాగా ఖరీదయిన ప్రాంతం లో రద్దీ గా ఉండే చోట ఉన్న ఆ ప్రాపర్టీ వాళ్ళ స్వంతం.
ఎప్పుడో దశాబ్దం క్రితం చనిపోయిన తండ్రి సూచనల!! ప్రకారం వారి కుటుంబం నడుచు కుంటూ ఉంటుంది. అన్నీ ఆయన చెప్పిన ప్రకారమే జరుగుతుంది.
రెండో కొడుకు లలిత్ చురుకయినవాడు. అతని కి అనుకోని యాక్సిడెంట్ అవటం అతని గొంతు మూగ బోవటం దగ్గర ఈ కధ మొదలవుతుంది.
మనిషి మానసికంగా భాలహీనం అయ్యేది కష్టం వచ్చినప్పుడే. ఆతను వ్యాపార లావా దేవీలని కాగితం మీద వ్రాసి చూపించడం ద్వారా నిర్వహించేవాడు. అలా ప్రతి విషయం వ్రాయటం అతనికి అలవాటు అయ్యింది.
భగవంతుణ్ణి నమ్మటం. అతి విశ్వాసం. అందుబాటులో ఉన్న అన్ని మతాల నమ్మకాలని పాటించడం అతనితో పాటు అతని కుటుంబం మొత్తం ఆచరించేది.
లలిత్ ఏ దైవ అనుగ్రహమో కాని నోటి మాట వచ్చింది.
యావత్ కుటుంభం సంతోష పడింది. తల్లీ, అన్నా వదినా, అక్కా మేనకోడలు, కొడుకులు కూతుర్లు సంతోషం పట్టలేక పోయారు.
లలిత్ కొత్తగా మళ్ళీ వచ్చిన గొంతు తో “నాకు నాన్న కనిపించి మాట్లాడుతున్నాడు. ఆయనే నాకు మాట ఇచ్చాడు.”
అని చెప్పాడు. కుటుంబం సంతోషించింది.
“మా ఇద్దరినీ ప్లే వుడ్ వ్యాపారం చెయ్యమని చెప్పాడు.”
వ్యాపారం అభివ్రుది చెందాక ఆర్ధికంగా మరింత నిలదొక్కుకున్నాక లలిత్ మాటల మీద కుటుంబానికి విశ్వాసం పెరిగి పోయింది.
నాన్న రెండు రోజులు మౌనంగా ఉండమన్నాడు. ఎవ్వరితోను మాట్లాడ వద్దు అని చెప్పాడు.
వాళ్ళు పూర్తిగా అలాగే చేసారు. మనసా వాచా అదే ఆచరించారు.
వారి ఇంట్లో పూజలు, రక రకాల వ్రతాలు మొదలయ్యాయి.
‘నాన్న’ చెప్పినట్లే పిల్లలకి మంచి కళాశాలల్లో సీట్లు వచ్చాయి. వ్యాపారం పుంజుకుంది.
33 ఏండ్ల మేనకోడలి వివాహం నిశ్చయమయింది.
ఇక లలిత్ (నాన్న) చెప్పిందే వేదం. కుటుంబం మొత్తం గుప్పిట మూసింది. మర్రిచెట్టు ఊడల్లా వాళ్ళ విశ్వాసం మెదళ్ల లోకి బలంగా ఊడలయ్యింది.

&&&&&
మోక్షం అంటే? బంధాల నుండి విడిపోవటం. భగవంతునికి ప్రీతీ కలిగేలా జీవించి సహజ మార్గం లో ఆయన్ని చేరుకోవటం?
లేదా శ్రద్దగా, పరిపూర్ణ మయిన సమర్పణ భావం తో జీవితాన్ని అంకితం చేసుకోవటమా?
ఎప్పుడైతే జీవన భ్రాంతిలో పడి కర్మలు చేస్తున్నామో, వాటి ఫలాలు అనుభవించాల్సి వచ్చి మళ్ళీ మళ్ళీ జన్మలను పొందుతున్నాం..
ఈ కర్మ ఫలాలను అనుభవించటమే బంధం అంటే! ఈ జన్మ, కర్మల వలయంలో చిక్కుకోకుండా ఉండటమే మోక్షం అంటే.
.
అసలు ప్రాణం అంటే? 22 గ్రాముల మాయ?
ఎక్కడి నుండి వస్తుంది ఎటునుండి వెళుతుంది.
వచ్చినప్పుడు ఆహ్లాదంగా వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు ఎందుకు అలా కాదు.
పోతున్నప్పుడు సమర్పణ భావం తో పోగలిగితే అది మోక్షానికి దారి తీస్తుందా?
పోతున్న మార్గాన్ని చూడ కూడదా?
శారీరిక భాదని లక్ష పెట్టకూడదా?
అలా వీడ్కోలు పలికినన ప్రాణం తనతో పాటు ఆత్మ?!? ని తీసుకెల్తుందా? అక్కడ??
మోక్షం తో పాటు అనేక శక్తులని బహుమతులు గా ఇచ్చి పంపుతుందా?
తిరిగి భూమి మీదకి మాన జీవితం లోకి వచేస్తామా?
అలా వచ్చాక అంతా అనుకున్నట్లు జరుగుతుందా? భవిషత్తు తెలుస్తుందా? గమనాన్ని శాసిస్తామా?
అవును అనే చెబుతున్నాడు “నాన్న”
ఈ దైవ రహస్యాన్ని మూర్ఖుల తో పంచుకోకూడదు. ప్రస్తావించ కూడదు. ఈ సన్మార్గం లోని కి అందరికి ప్రవేశం లేదు.
ఇది నాన్న మనకి చూపిస్తున్న మార్గం. తోడుగా ఉండి మన ప్రయాణాన్ని సులువు చేయటానికి సిద్దంగా ఉన్నాడు
నాన్న దగ్గరకి వెళ్లి వద్దామా ?
&&&&
జూలై ఒకటి 2018
ఢిల్లీ లోని బురారి ప్రాంతం,
ఉదయాన్నే ఇంటింటికి పాలు సరఫరా చేసే వాన్ ఆ వీది మలుపులో ఆగింది. ఆ ఇంటి కింద ఉన్న షాప్ షట్టరు మూసి ఉంది. కుర్రాడు మేడ మీది ఉండే కస్టమర్ కోసం కాలింగ్ బెల్ నొక్కాడు.
ఎవరూ తొంగి చూడలేదు.
పాల పాకెట్లు తీసుకుని మెట్లు ఎక్కాడు.
11 కిటికీలు ఉన్న ఆ ఇంటి తలుపు లు బార్లా తెరిచే ఉన్నాయి. ఆశ్చర్యంగా అతను లోపలి తొంగి చూసాడు.
ముందు గది హాల్లో కి వేలుతురు రావటానికి స్లాబ్ సువ్వలకి కాంక్రీట్ వెయ్యకుండా ఉంచిన OTS (ఓపెన్ టు స్కై) నుండి ఉదయం వెలుగు ఆ గదిలోకి నేరుగా పడుతూ ఉంది.
మెత్తటి గుడ్డతో చుట్టిన వైరులకు వేలాడుతున్న మొత్తం 9 మంది శరీరాలు పూజ గది ముంది మరొకటి, లోపలిగదిలో మంచం మీద నారాయణీ దేవి తో పాటు మొత్తం 11 శరీరాలు వాటిలో పది వేలాడుతూ ...
క్షణాల్లో అందరూ పోగయ్యారు. పోలీసులు , మీడియా అంతా గుమి గూడారు.
క్లూస్ టీం ఇల్లంతా వెతికింది. డబ్బు నగలు అన్నీ క్షేమం.
అన్ని శరీరాలు ఒకే మాదిరిగా ఉన్నాయి.
కళ్ళకి గంతలు, వెనక్కి కట్టుకున్న చేతులు, నోటిలో తడి గుడ్డ, చెవుల్లో దూది.. ముఖాల్లో ప్రసాంతత. ఉమ్మడి ప్రయాణానికి ప్రయత్నపూర్వకంగా సిద్దమయినట్లు..
11 డైరీలు దొరికాయి. ఆ కుటుంబం లో ‘నాన్న’ చెప్పిన మాటలు వాస్తవాలు అవటం అనేక టెస్టిమోనియల్స్
లలిత్ (నాన్న) వ్రాసిన పుస్తకం లో ఎవరెవరు ఎక్కడెక్కడ వేలాడాలో స్కెచ్ గీసి ఉంది.
ఎవరు ఎటువైపు నిలబడాలో, ప్రయాణం లో ఎంత ప్రశాంతంగా ఉండాలో, ఎంత సమర్పణ తో ఉండాలో వ్రాసి ఉంది.
ఏ రంగు స్టూల్ మీద ఎవరెవరు నుంచోవాలో కూడా విపులంగా ఉంది. ఆరు రోజులు గా అందరూ సమిష్టిగా ఏర్పాట్లు చేసుకోవటం వీధి లో ఉన్న సి సి కెమెరాలలో రికార్డ్ అయి ఉంది.
ఇంటి వెనుక పరాయి స్థలం వైపు గోడ నుండి బయటకి బిగించిన 11 ప్లాస్టిక్ పైపులు, 11 డైరీలు, మేన కోడలి ఎంగేజ్మెంట్ అయ్యిన 11 వ రోజు ఈ సంఘటన జరగటం, మొత్తం ఏడుగురు స్త్రీలు (75,57,45,40,33,25,&23) నలుగురు పురుషులు (50,40,15 &) వెరసి 11 మంది అంతు పట్టని స్థితి లో మరణించి ఉండటం అన్నిటినీ క్రోడీకరించి మీడియా పరిశోధకులు, సమాజం మీదికి అపోహలని వదలటం ఇవన్నీ అప్పట్లో ఒక సంచలనం.
మన పోలిస్ యంత్రాంగం వాస్తవాలని పరిశోదించ కుండా, మీడియా మేధావులు బై పాస్ చేయటం లో సఫలీ కృతమైన ఒక నొక కేసు ఇది.
తొమ్మిది మంది వేలాడిన భగవాన్ కి రాస్తా ఈ ఫోటో లో కనిపించేది.

(పాటియాలా లో ఉండే సోదరి, ఆ పుస్తకం లోని వ్రాత తన అన్న లలిత్ ది కాదని, మరెవరో వ్రాసి ఉంటారని. చేతి వ్రాత లో అనేక మార్పు లు ఉన్నాయని, తమ కుటుంబం సంప్రదాయ మయిన హిందూ కుటుంబం అని, ఎలాటి క్రుద్ర శక్తులని పూజించే/నమ్మే వాళ్ళు కాదని. వారం క్రితమే తనూ కుటుంబం తో కలిసి కొన్ని రోజులు గడిపి వెళ్లానని, తమ ఫ్యామిలీ కి భిన్నమయిన అలవాట్లు జీవన విధానం ఏమీ లేదని, సమాజానికి క్షుద్రాన్ని అంటింది మీడియా వాళ్ళే అని మొత్తుకుని చెప్పింది. కాని ఆమె వాదన స్పైసీ గా లేదు కదా?.. నేను నమ్మట్లేదు. ఎందుకంటే నేను బుర్ర వాడటానికి ఇష్ట పడను కాబట్టి.. )
మరిన్ని వివరాలకి
తో పాటు మీకు కనిపిస్తాయి.

Wednesday 15 April 2020

చెప్పులు

ఒక అధికారిక ప్రోగ్రాం కి, శలవు రోజు న అటెండ్ అయి మండల స్పెషల్ అధికారి అయిన DEO గారి కార్లో, జిల్లా హెడ్ కార్యాలయానికి బయలు దేరేసరికి మద్యానం రెండు దాటింది. (రెండేళ్ళ క్రితం సంఘటన)
..
మరో గంట ప్రయాణం ఉంది. ఆకలి ని బిస్కెట్ల తో బై పాస్ చేసి, చల్లటి మంచి నీళ్ళతో కడుపు నింపాము.
మీరు షార్ట్ స్టోరీస్ వ్రాస్తారని ఎంఇఓ గారు చెప్పారు. అన్నాడాయన కారు మెయిన్ రోడ్డు ఎక్కగానే.
సీరియస్ రైటర్ ని కాదు. కాని మనసుకి నచ్చినది అక్షరాలలోకి మారుస్తుంటాను.
అయితే మీకో ఇన్సిడెంట్ చెబుతాను.
‘చెప్పండి’ ఆసక్తిగా ఆయన వైపు చూసాను.
..
కొన్నాళ్ళ క్రితం దోర్నాల వద్ద ఒక స్కూల్ ఇన్స్పెక్షన్ కి వెళ్లాను. మిడ్ డే మీల్స్ ప్రోగ్రాం నిర్వహణ గురించి.
ఘాట్ లో ఒకటిన్నర కిలోమీటర్ల ప్రయాణం చేసి, నాలుగు ఫర్లాంగులు దూరం కాలి నడకన వెళ్ళాల్సి వచ్చింది.
మొత్తం ముప్పై మంది పిల్లలు ఉండొచ్చు. నాలుగు అయిదు తరగతుల్లో పది, పన్నెండు మంది మించరు.
వాళ్ళతో పాటు మద్యాన్న భోజనం చేసి రెండు గంటల పైగా గడిపాను.
చుట్టూ ఉన్న తండా ల నుండి రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఉండే దారిలో నుండి కాలి నడకన సిమెంటు గోతాల లో పుస్తకాలు చుట్టుకుని వస్తుంటారు.
అక్కడ ఉన్న ఏకైక ఉపాద్యాయుడు భాద్యత గా ఉండటం నేను గమనించాను.
ఇర్రెగ్యులర్ గా స్కూల్ కి వచ్చే పిల్లలకి సాద్యపడిన వరకు చదువు చెప్పినట్లు పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు తెలిసింది.
విషయం అంత ఆసక్తి దాయకం గా ఉండక పోవటం తో నేను వింటున్నానా లేదా అని అయన నన్నో సారి గమనించాడు.
‘మా (ప్రభుత్వ) స్కూల్ ల లో చదివే పిల్లలు మెజారిటీ బాగా బీద కుటుంబాల నుండి వచ్చే వాళ్ళు అయివుంటారు. మద్యాన భోజనం కోసం వచ్చే పిల్లలు అధికం. కనీస వసతులు కూడా ఉండవు. స్కూల్ లో ఇచ్చే ఏకరూప దుస్తుల గురించి మీకు చెప్పేదేముంది.’ ఆయన నన్ను చూసి నవ్వాడు.
నేనే ఏ స్కూల్ కి వెళ్ళినా పిల్లల్ని ఎదో ఒకటి అడిగి కొంచెం శ్రద్దగా నేర్చుకుంటున్న పిల్లలకి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి నా కారు డిక్కీ లో ఎప్పుడూ ఉండే చెప్పుల (స్లిప్పర్) జతలు, పెన్నులు, పుస్తకాలు, పలకలు ఇస్తూ ఉంటాను. పిల్లలని ప్రోత్సహించడానికి ఇలా చేస్తుంటాను. నాకు ఇదో వ్యసనం.
నవ్వాడాయన. నేను ఆయన్ని అభిమానం గా చూసాను.
ఆరోజు ఒక చెప్పుల జత టేబుల్ మీద పెట్టి...
నాలుగు అయిదు తరగతి పిల్లలకి మొత్తం పన్నెండు మంది కి తలా ఒక ఏఫోర్ కాగితం ఇచ్చి కొన్ని ప్రశ్నలు బోర్డు మీద వ్రాసి వాటికి సమాధానాలు కాగితం మీద వ్రాసి ఇవ్వమని చెప్పాను. బాగా వ్రాసిన వాళ్లకి చెప్పుల జత బహుమతి అని చెప్పాను.
కాగితం కుడి పక్క మూలన వాళ్ళ పేరు, క్లాసు వ్రాసి ఇవ్వమని అడిగాను.
వ్రాసాక పేపర్లు టీచర్ కి ఇచ్చి బాగా వ్రాసిన పిల్లాడిని సెలెక్ట్ చేసి వాటిని గిఫ్ట్ గా ఇవ్వమని చెప్పి రిటర్న్ అయ్యాను.
ఆయన చెప్పటం అయిపొయింది అన్నట్లు ఆపాడు.
ఇదొక సంఘటన. సాదా సీదా ది. ప్రత్యేకంగా చెప్పుకోటానికి ఏమీ లేదు. ఈయన డబ్బా తప్ప అని మనసులో అనుకుంటున్నప్పుడు. ..
కధ అయి పోలేదు... అన్నాడాయన.
పేపర్లు నేను దిద్దుతానని అనుకుని పన్నెండు మంది పిల్లల్లో ఎనిమిది మంది ఒకే పేరు వ్రాసారు ట ..
'కుప్పయ్య' అని ...
వాళ్ళందరిలో ఉత్త కాళ్ళతో స్కూల్ కి వచ్చే వాడి పేరు అది.

Sunday 29 December 2019

దేవుడు ఎప్పుడూ గుడి లోనే ఉండడు.


పాలక్కడ్ (కేరళ) లో ఉండే ఒక పందొమ్మిదేళ్ళ కుర్రాడు జయక్రిష్ణన్ మూడేళ్ళ వయసప్పుడు తల్లి తండ్రిని ఒక ప్రమాదం లో కోల్పోయాడు.
మిగిలిన పూరి ఇంట్లో నానమ్మ పిల్లాడిని చాకింది. తినీ తినకా కూలి నాలి చేసుకుని వాడిని చదివిస్తూ ఉంది. 2007 లో జయక్రిష్ణన్ తన ప్లస్ వన్ (ఇంటర్ మొదటి సంవత్సరం) చదివేటప్పుడు అతని శరీరం లో మార్పులు మొదలయ్యాయి.
అతని #కధ మొదలయ్యింది.
హటాత్తుగా బరువు పెరగటం, కాళ్ళు వాయటం, మొహం వాపు, నిద్ర లేచేసరికి కళ్ళు కనిపించక పోవటం ...
పాలక్కడ్ ప్రభుత్వ ఆస్పత్రి లో రక్త పరీక్ష చేసారు. జయక్రిష్ణన్ కి ereatinine నిల్వలు పెరుకుపోవటం (కిడ్నీ సరిగా పనిచేయక పోవటం వల్ల వ్యర్ధాలు పేరుకు పోవటం) జరిగిందని అత్యవసరం గా వైద్య సాయం అందాలని...
అప్పటికే అనాధ అయిన జయక్రిష్ణన్ చదువు ఆపేయవలసి వచ్చింది.
నాయినమ్మ తాము ఉంటున్న ఇంటిని బంధువుల వద్ద తాకట్టు పెట్టి వైద్యం చేయించడం మొదలెట్టింది.
కాని అంతంత మాత్రపు వైద్యం అతనికి ఉపయోగ పడక పోగా కాళ్ళు చచ్చుపడి నడవ లేని స్థితికి చేర్చింది.
వెంటనే డాక్టర్లు డయాలసిస్ కి అతన్ని మార్చేసి ముసలావిడకి చెప్పేశారు. #కిడ్నీ ని వెంటనే మార్చాలి. లేకుంటే అతన్ని మర్చి పోవాలి.
**
వాళ్ళ వాడ లోనే ఉండే 'విష్ణు' అనే వ్యక్తి డయాలసిస్ కి ఆర్ధిక సాయం చేసేవాడు. అదృష్ట వశాత్తు ఆతను ‘దయా చారిటబుల్ ట్రస్ట్ ‘ లో ఆక్టివ్ మెంబర్.
నిరుపేదల సాయం కోసం పని చేసే ట్రస్ట్ అది.
విష్ణు ట్రస్ట్ లో సభ్యులకి జయక్రిష్ణన్ అసహాయ పరిస్థితి తెలియపరిచాడు. వెంటనే ఆ సంస్థ జయక్రిష్ణన్ ఇంటికి చేరింది.
జయక్రిష్ణన్ వైద్యం ఖర్చులు భరాయించేందుకు ట్రస్ట్ ముందుకు వచ్చింది. జయక్రిష్ణన్ దగ్గరి బంధువులని కిడ్నీ డొనేషన్ చెయ్యమని అడిగింది. కిడ్నీ దానం చేసిన వారికి ఒక మంచి ఇల్లు నిర్మించి ఇస్తామని, మంచి ఉద్యోగం చూయిస్తామని ప్రామిస్ చేసింది.
అప్పటిదాకా బండువులం అని చెప్పుకున్న వాళ్ళు కూడా మొహం దాచేశారు.
ఏమీ చెయ్యటానికి పాలు పోనీ స్థితిలో ట్రస్ట్ మెంబర్ ఒకరు తన ఫేస్బుక్ వాల్ మీద జయక్రిష్ణన్ దీన గాధ ని వ్రాసాడు.
దేవుడు ఎప్పుడూ గుడి లోనే ఉండడు.
కొట్టాయం లో ఉండే HR ప్రొఫెషనల్ 47 ఏళ్ల శ్రీమతి 'సీత దిలీప్' ఈ పోస్ట్ చదివింది. భర్త తో తను జయక్రిష్ణన్ కి కిడ్నీ దానం చేస్తానని చెప్పింది.
ప్రతి మనిషికి తన శరీరం మీద సర్వ హక్కులు ఉంటాయి. అవయవ దానం అనేది నీ వ్యక్తిగతం. నేను అబ్యంతర పెట్టను. కాని దీనికి చాలా ఓర్పు. సహనం కావాలి. కొన్ని త్యాగాలు కూడా చెయ్యవలసి ఉంటుంది. వాటన్నిటికీ నువ్వు సిద్దపడితే నాకు ఏమాత్రం అబ్యంతరం లేదు అని చెప్పాడతను.
మరు క్షణం ఆమె తన అభిప్రాయాన్ని స్థిరంగా మరో మారు చెప్పింది.
ఆమె భర్త తో పాటు ట్రస్ట్ ని కలిసింది.
అమృత ఆసుపత్రి లో క్రాస్ మ్యాచ్ టెస్ట్ లు జరిగాయి. దాత వి పేషంట్ వి బ్లడ్, టిస్యు లు అనేక సార్లు మ్యాచ్ చేసి చూడాల్సి వచ్చింది. వయసులో చిన్న వాడయిన అబ్బాయికి కిడ్నీ ఇవ్వటానికి ఆమె తన శరీరాన్ని శ్రమ కి గురి చెయ్యాల్సి వచ్చింది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి వచ్చింది. చివరికి తన ఉద్యోగాన్ని వదిలెయ్య వలసి వచ్చింది. 2019 మే నుండి నవంబరు వరకు అనేక సార్లు క్రాస్ మాచ్ పరిక్షలు జరిగాక డిసెంబరు 10 తేది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
ఈ లోగా ట్రస్ట్ వైద్యానికి అవసరం అయిన డబ్బు ని దాతల సహకారం తో ఏర్పాటు చేసింది. ఆసుపత్రి ఖర్చులకి 8 లక్షలు మిగిలిన ఖర్చులు కలసి మొత్తం 15 లక్షలు సంస్థ సేకరించింది.
డిసెంబరు 8 తేదిన సీతా & దిలీప్ లు తమ 23 వ వివాహపు వార్షికోత్సవాన్ని ఆసుపత్రి లోనే జరుపుకున్నారు.
అనేక మంది బంధువులు, స్నేహితులు భయపెట్టినా, నిరుత్సాహ పరచినా వేటికి వెరవకుండా #సీత జయక్రిష్ణన్ కి పునర్జన్మ ని ప్రసాదించింది.
జయక్రిష్ణన్ మరో మూడు నెలలు ఆ #తల్లి #సీత తో పాటు కొచ్చిన్ లో ఉంటాడు.
పాలక్కట్ లో జయక్రిష్ణన్ & నాయినమ్మ కోసం మంచి పరిసరాల్లో ఒక చిన్న ఇంటిని ఏర్పాటు చేసే పని దయా చారిటబుల్ ట్రస్ట్ తీసుకుంది.
**
ఎవరు చెప్పారు దేవుళ్ళు గుళ్ళోనే ఉంటారని??



www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...