Wednesday 27 December 2017

వెండి పట్టీలు

మరియమ్మ - చౌడమ్మ.


క్రిస్టమస్ కి ఇంటికి వచ్చిన మరియమ్మ ని కలిశాను.
ఫుల్ గా అలక మీద ఉంది. 
..
నేను స్కూల్ కి పోను. అమ్మ ఒక డ్రెస్సె కొనిచ్చింది. "
నాకు నవ్వొచ్చింది. ఇంకా బాల్యం వీడలేదు.
"ఇంకేం కావాలి?"
చాలా సేపు మాట్లాడాక అడిగాను.
"ఇంకో డ్రెస్. ఇంకా..వెండి పట్టీలు..సన్నవి"
"అమ్మ చేత డ్రెస్ కొనిపించుకుని రేపు స్కూల్ కి వెళ్ళు.
బాగా చదువుకొని నా అంత లావుగా కావాలి.
జనవరి ఫస్ట్ కి ఇంటికి వచ్చినప్పుడు వెండి పట్టీలు రెడీ గా ఉంటాయి"
"ని జం గా నా?"
"నిజంగా😊"

Monday 25 December 2017

శారదా దేవి.


రామకృష్ణ పరమహంస శరీరం విడిచారు.
ఆయన బార్య అనేక సంవత్సరాలు గా వస్తున్న ఆనవాయితిని వ్యతిరేకించింది.
శిరోముండనం చేయించుకోలేదు. శ్వేతవస్త్రం ధరించలేదు. కంట నీరు కార్చలేదు.
ఆయన శరీరాన్ని శ్మశానం కి తీసుకెళ్ళాక, రోజు మాదిరిగానే ఆయనకి వంట చేసింది.
ఎప్పటి లాగే ఆయన కూర్చుని బోజనం చేసే బల్ల పక్క కూర్చుని విసనకర్రతో గాలి విసురుతు బోజనం వడ్డించింది.
సాయంత్రానికి పడక ఏర్పాటు చేసింది. చుట్టూ తెరలు కట్టింది. అంతా యధావిది గా ఉంది.
ఆమెకి పిచ్చి పట్టినట్లు శిష్యులు నిర్ధారణ చేసుకున్నారు.
“ఆయన చనిపోలేదు. కనీసం నావరకు. ఆయన భౌతిక శరీరం తో నాకు పనిలేదు. ఆయన సాన్నిద్యం, పరిమళం నాకు యధార్ధం. అవి నాతోనే ఉన్నాయి అవి ఉన్నంతవరకు గాజులు పగలగొట్టను. కురులు తీయను. ఆచారాలు పాటించను. ఆయన నాకు సజీవుడే” అనేది.
ఆయన మరణానతరం చాలా కాలం జీవించింది. ప్రతి రోజు రెండు సార్లు శుచిగా వంట చేసేది. బర్త తో కబుర్లు చెప్పేది. ఆయనకి సేవలు చేసేది. శిష్యులతో మాట్లాడేది. సందేహ నివృత్తి చేసేది.
హృదయం ఉన్న కొంత మంది ఆమె కి పిచ్చి లేదని అర్ధం చేసుకున్నారు. ఆమె చక్కటి సలహాలు, బోధనలు చేస్తూండేది.
ఆమె ఒక్కతే చిరకాల జీవన సహచరి. ఆయన దేహాన్ని కాకుండా మనసుని అంగీకరించినది. ఆమె చివరి శ్వాస వరకు ఆమె అలానే ప్రవర్తించింది.
ఒక రోజు ఆమె కి వేళ అయ్యింది.
అప్పుడామే రోదించడం మొదలయ్యింది.
పరమ హంస చనిపోయినప్పుడు దుఃఖించని ఆమె తీవ్ర దుఃఖం తో కదిలి పోయింది.
“ఆయన్ని ఎవరు చూసుకుంటారు? ఆయన సేవలు ఎవరు చేస్తారు?”
నిశబ్దాన్ని చేరుకునే పద్దతి అది.
ఎదురుచూసే హృదయ రీతి అది.
మరణం ఎలాటి ఆటంకాన్ని, దూరాన్ని కలిగించలేదు.

క్రిష్టమస్ తాత

వృత్తి జీవితం లో కొన్ని శిఖరాలు ఉంటాయి. శిఖరాలు అంటే కేవలం అవార్డులు, ప్రమోషన్లు మాత్రమే కాదు.
ఒక విడో. చెప్పుకోలేని అనారోగ్యం.
ఒకటే కుమార్తె. ప్రభుత్వం ఇచ్చిన చిన్న స్థలం లో ఒక పూరిల్లు.
వారం లో నాలుగు రోజులు కూలి పని. ..
మూడు రోజులు ప్రభుత్వ దవాఖానా మందులు.
ఎవరి దయాదాక్షణ్యాలు అవసరం లేకుండా ఒక కేంద్ర ప్రభుత్వ పదకం లో ఒక ఇల్లు మంజూరు.
2011 జనాబా లెక్కల్లో పూరి పాకగా నమోదు కారణం గా..
ఇల్లయితే మంజురయింది కాని. కట్టుకోటానికి కనీస పెట్టుబడి లేదు..
కట్టుకునే ఓపికా లేదు.
ఒక అటో డ్రైవర్ ఆమె ఆరోగ్యంగా ఉన్నంతవరకు .. తోడుగా ఉన్నాడు.
ఆమె కి భవిషత్తు మీద ఒక నమ్మకం.
పిల్లని నవోదయా స్కూల్ లో చదివిస్తూ ఉంది.
చలికి, వానకి ఎవరు ఆమెని తమ పంచలో తలదాచుకోనివ్వరు.
సాకులు అనేకం.
కధ లో మలుపు ఏమిటంటే,,
ఆ లభ్దిదారురాలు నా జ్యురిడిక్షన్బ్ లోకి వస్తుంది. 
బ్యాంకు బుక్, మట్టిపని కార్డు, లాటివి జెనరేట్ చేయించి ఆన్లైన్ లో ఎలిజిబుల్ చేసి ఉంచాను. స్థానిక పరిచయాలు, పలుకుబడులు వాడి ఇల్లు గోడల వరకు కట్టించాను. ఇక నావల్ల అవలేదు.
ఇంటి మొత్తానికి సరిపడే డబ్బు ప్రభుత్వం ఇవ్వదు. అప్పటికే పద్దెనిమిది వేలు ఖర్చు చేసి ఉన్నాను.
ఒక వారం క్రితం ఆ గ్రామం వెళ్లి ఆమెతో మాట్లాడి ఇంటి కప్పు వేసుకొమ్మని చెప్పాను. ఆమె నవ్విందో లేదో కాని అసహాయత ని చూడటం నా వల్ల కాలేదు.
ఆమెకి కప్పు వేస్తే ముపై వేల రూపాయలు బిల్లు చెయ్యగలను.
ఆ డబ్బులు దేనికి సరిపోవు.
అవి కుడా ఇల్లు పూర్తి అయ్యాక విడుదల అవుతాయి.
కొన్ని చిన్న సంఘటనలు డ్రమెటిక్ గా ఉంటాయి.
నేను అక్కడ ఉన్నప్పుడే ఆమె కుమార్తె (8వ తరగతి) స్కూల్ నుండి ఫోన్ చేసింది. “చలికి ఎలా ఉన్నావు. స్కూల్ లో పడుకోరాదు. అంటూ.. తల్లిని పరమర్సించింది.
" క్రిస్టమస్ సెలవులకి తీసుకెళ్ళు అమ్మా అని అడిగింది”
“క్రిస్టమస్ కి వచ్చి నువ్వు నాతో పాటు చలిలో చావటం ఎందుకు. అక్కడే ఉండు” అని తల్లి చెబుతుంది.
అప్పుడా అమ్మాయి. “ అమ్మా క్రిస్టమస్ తాత వచ్చి మన ఇంటి కప్పు వేస్తే బావుంటుంది కదా?” ఆశగా అడిగింది.
చైనా ఫోన్ లో పెద్దగా వినబడుతుంది ఆ సంభాషణ.
నేను మా వర్క్ ఇన్స్పెక్టర్ బాలు నాయక్ అక్కడినుండి బయలు దేరాం.
**
ఇరవయ్యవ తేది న హైదరాబాదు లో ఉన్నప్పుడు,
మా బాలు నాయక్ ఆమె ఇంటి వద్ద నుండి ఫోన్ చేసాడు.
“సర్ చౌడమ్మ స్లాబ్ అయిపొయింది. మీరు ఇచ్చిన యాబై వేలలో ఆరున్నర వెయ్యి మిగిలాయి”

“ఒకే, సిమెంటు, ఇనుము సరిపోయిందా?”
“ఆరు 8mm సువ్వలు, నాలుగున్నర కట్ట సిమెంటు మిగిలింది. కంకర అర ట్రక్ ఉంది “
“వర్కర్స్ కి బోజనాలు ఎలా చేసావ్? “
“హోటల్ లో వండించాను. 1400 వందల్లో అయిపొయింది.’
“గుడ్ .. వచ్చాక మాట్లాడుకుందాం”
***
ఈ రోజు ఆ ఉరు వెళ్ళాను. బాలు నాయక్ ని వెంటబెట్టుకుని.
ఒక పీపా లో స్టోర్ చేసుకున్న నీళ్ళ తో స్లాబ్ తడుపుతూ ఉంది.
చౌడమ్మ చైనా ఫోన్ లో కూతురికి ఫోన్ చేసి మాట్లాడింది.
“క్రిస్టమస్ తాత వచ్చి మన ఇంటి కప్పు వేసాడు” మమ్మల్ని గమనిస్తూ చెప్పింది.
పిల్లని పండక్కి తీసుకురమ్మని చెప్పి కొంత డబ్బు ఇచ్చి వచ్చాను.
క్రిస్టమస్ శుభాకాంక్షలు. _/][\_

Friday 24 November 2017

షార్క్ చేప

తాజా చేపలు అంటే జపనీయులకి చాలా మక్కువ.
తీర ప్రాంతాల లో చేపలు సంవృద్ధిగా దొరకటం తగ్గిపోయింది.
పెద్ద పెద్ద బోట్లు వేసుకుని సముద్రం లోపలికి వెళ్ళి రోజుల తరబడి వలలు వేసి తీసుకురావాల్సి న పరిస్తితి.
కానీ ఇక్కడో చిక్కు వచ్చి పడింది. చేపలు తాజా గా ఉండటం లేదు.
రెండు మూడు రోజులు సముద్రం లో వేట పూర్తిచేసుకుని బోట్లు ఒడ్డుకి కి చేరి మార్కెట్ కి వెళ్ళే సరికి....
ఫిషింగ్ కంపెనీ లు బోట్లులో డీజిల్ జెనరేటర్ తో పనిచేసే ఫ్రీజర్ లు బిగించారు. చేపలు ఫ్రీజర్ లో ఉంచడం ఒడ్డు కి వచ్చాక నీళ్ళలో వేసి మార్కెట్ చేయటం.
ఊహూ ఇది కూడా ఫెయిల్ అయింది.
తాజా చేపల రుచి ఫ్రీజర్ లో ఉంచిన వాటికి ఉండదు. చేపల అమ్మకం ధర భారీగా పడిపోయింది.
ఈ సారి ఫిషింగ్ కంపనీలు బోట్లు లో నీళ్ళ తోట్లు ఏర్పాటు చేశాయి.
పట్టిన చాపలు తొట్లలో చని పోకుండా ఒడ్డుకు రావటం వాటిని మార్కెటింగ్ చెయ్యటం... మొదలయ్యింది.
కానీ తమాషా గా వీటిని కూడా కస్టమర్లు కొనటానికి ఆసక్తి చూపలేదు.
తక్కువ నీళ్ళలో బద్దకంగా జీవించడానికి మాత్రమే కదిలే అవకాశం ఉన్న ఇవి తాజా చేపల రుచి తో పోటీ పడలేక పోయాయి.
ఈ సమస్య చాలా కాలం పాటు ఫిషింగ్ కంపెనీలని వేధించింది.
ఎలా? ఎలా?
ఏమి చెయ్యాలి?
సముద్రం లో పట్టి పెద్ద ఫైబర్ తొట్లలో రవాణా చేసే చేపల మద్య ఒక చిన్న షార్క్ చేపని వదలారు. వాటికి ఆహారం కోసం మరింత చిన్న చేపలని తోట్లో వేశారు.
షార్క్ చాప ఉల్లాసంగా వీటిని తరుము తూండేది. రక్షణ కోసం చేపలు పరిగెడుతుండేవి.
స్తబ్దుగా ఉన్నవి దానికి ఆహారం గా మారెవి. చురుగ్గా ఉన్నవే తాజాగా ఒడ్డుకి చేరేవి.
వినియోగదారులు ఆదరణ బాగా ఉండేది.
ఈ విదంగా సమస్య పరిష్కారం అయ్యింది.
***
మనకి కూడా ఈ షార్క్ లాటి లక్ష్యాలు అవసరం.
లక్ష్యం ఉన్నప్పుడే ఆలోచనలు చురుగ్గా ఉంటాయి.
శ్రమ పడటం మొదలెడతాం. కాలం విలువని గుర్తిస్తాం.
ఫలితాలని సాధిస్తాం.
జీవితం లో ఉన్నత స్థానానికి ఎదుగుతాం.

Wednesday 22 November 2017

బండరాయి

రహదారి మార్గం లో ఒక పెద్ద బండరాయిని అడ్డుగా వేయించి చాటుగా గమనించసాగాడు రాజు గారు.
“ఏం రాజు? ఏం పరిపాలనా? శిస్తులకే గాని ప్రజల పనులు పట్టించుకొని రాజ్యం లో ఉన్నాం మనం. ఖర్మ” అంటూ ఈసడించుకున్నారు ఆ మార్గాన పోతున్న వారు కొందరు.
అదికారులు ఆ బండరాయిని చూసి హుంకరించారు. “ఎవరు ఈ పని చేసింది. కనుక్కుని కారాగారం లో ఉంచండి” హుకుం లు జారీ చేశారు.
రాజు గారు వింతగా చూస్తున్నారు. కొద్దిగా శ్రమ పడి బాద్యత తీసుకుంటే దానిని తొలగించడం పెద్ద పనేమీ కాదు.
చాలా సేపటికి ఆ దారినే ఒక కుటుంబం ఎద్దుల బండి మీద ప్రయాణం చేస్తుంది.
రహదారి మీద బండ రాయి ని చూసి బండి ని పక్కకి మర్లించాడు కొడుకు.
తండ్రి బండిని ఆపించి, ఇద్దరు కుమారులతో కలిసి చకచక్యంగా రాతిని పక్కకి నేట్టాడు. మార్గం సుగమం చేశాడు.
దొర్లించిన రాతి కింద బంగారు నాణేలు వారి కి కనిపించాయి.
తిట్టుకోవటమో, ఇతరులకు పురమాయించడమో కాదు సమస్య /సవాలో ఎదురొచ్చినప్పుడు స్వయంగా పరిష్కారానికి పూనుకోవాలి.
సమస్య అనే బండరాయి క్రింద అవకాశము అనే లబ్ధి దొరుకుతుందేమో...

Tuesday 21 November 2017

గార్గి

అయిదువేల సంవత్సరాల క్రితం, ఉపనిషత్తుల కాలం లో గార్గి అనే ఒక మహిళ ఉండేది.
స్త్రీ ల పట్ల ఇంత వివక్ష ఉండేది కాదు.  
తాత్వికుదయిన రాజు ప్రతి సంవత్సరం వివేకవంతులయిన పండితులని పిలిపించి పోటీ పెట్టేవాడు. గొప్ప జ్ణానులు మాత్రమే పోటీలకి హాజరయ్యే వారు. వాళ్ళలో కపటం అనేది ఉండేది కాదు.
ఒక సంవత్సరం రాజు వేయి ఆవుల బహుమతి ప్రకటించాడు. ఆవుల కొమ్ములకు రత్నాలు తాపడం చేసిన బంగారు తొడుగులు ఉంటాయని చెప్పాడు.
ఆ రోజుల్లో యజ్నవాల్యుడు సుప్రసిద్దుడు. విజయం పట్ల అనుమాత్రం కూడా సందేహం లేని వాడు. ఎక్కడ పోటీ జరుగుతుందో అక్కడ తన తత్వ పరిజ్ననమ్ తో పోటీ గెలిచేవాడు.
ఆ స్తలానికి వచ్చి వజ్రాలు, రత్నాలు తాపడం చేసిన కొమ్ములు ఉన్న ఆవుల గుంపుని చేసాడు. సూర్య కాంతి లో  ఆ దృశ్యం ఎంతో అద్ద్బుతంగా ఉంది.
వస్తూనే “వీటిని మన ఆశ్రమానికి తోలుకేళ్ళండి ఇవి అనవసరంగా ఎండలో బాధపడటం ఎదుకు? ఎటూ విజయం మనదే అని” శిష్యులని పురమాయించాడు.
అక్కడున్న జ్ణానులు ఎవరు ఆయన్ని నిలువరించలేక పోయారు. చివరికి రాజు గారు కూడా నిస్సహాయం గా ఉండిపోయాడు.
యాజ్ఞవల్యూడిని జయించడం ఆసాద్యమ్ అని వాళ్ళకి తెలిసి పోయింది. విజేతగా ప్రకటించే సమయం లో గార్గి ఆటల్లో పడి ఇంటికి రాని బిడ్డడిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది.
విజయానికి ముందే ఆవులని తోలుకెళ్లటం తెలుసుకుంది.
ఆమె చక్రవర్తి తో “మీరు ఆయన్ని విజేతగా ప్రకటించకండి. నేను నా బిడ్డ కోసం వచ్చాను. నా బిడ్డని వెతకమని ఎవరినయినా పురమాయించండి. నేను యాజ్ఞవల్యూడి తో వాదనకు సిద్దంగా ఉన్నాను. ఆయన చదువు కున్నవారు, పండితుడు కానీ పండితుడికి సత్యం అవగాహన కాదు” అంది.
అవి గొప్ప రోజులు స్త్రీలు కూడా గొప్పగా సవాలు చేయగలిగిన రోజులు. చక్రవర్తి ప్రకటనే చేయకుండా వాదన చేయటానికి అంగీకారం తెలిపాడు.

యాజ్ఞవల్యూడి ని ఆమె ఒక సాధారణమయిన ప్రశ్న వేసింది. “ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించాడు?” అంది.
ఆమె చిన్న ప్రశ్నకు బదులుగా యాజ్ఞవల్యూడు నవ్వాడు. చిన్న పిల్లల ప్రశ్నలు అడుగుతుంది. అనుకుంటూ “దేవుడు సృష్టించాడు. ఎందుకంటే ఏదయితే ఉన్నదో దాన్ని ఎవరో ఒకరు సృష్టించాలి కాబట్టి” అన్నాడు.
గార్గి నెమ్మదిగా “ దేవుడు ఉన్నాడు కదా? ఆయన్ని ఎవరు సృష్టించాడు?” అని అడిగింది.
యాజ్ఞవల్యూడు వలలో పడి పోయాడు. “దానికి సమాదానం గా మరో దేవుడు అని చెబితే తిరిగి ఆయన్ని ఎవరు సృష్టించాడు అని అడుగుతుంది. సమాదానం గా మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తుంది”
యాజ్ఞవల్యూడు తను ఇరకాటం లో పడి పోయినట్లు గ్రహించాడు. సహజం గానే ఆగ్రహం వచ్చింది. కత్తి దూశాడు.
గార్గి “మహారజా అతన్ని బంధించి ఆవులని వెనక్కి రప్పించండీ” అని పిల్లవాడిని ఎత్తుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది.
........................ ఓషో కధ నా మాటల్లో ...


విశ్రాంతి.

మనుషులు అంతులేని శ్రమ లో మునిగి ఉండటమే కాదు. విశ్రాంతి పొందే సమయము ఉంటుంది.
అనంత ఆహ్లాదాన్ని అందుకునే ఘడియలు ఉంటాయి. 
మనుషులు మరీ గంభీరం గా ఉండకూడదు.అది కూడా అనారోగ్య లక్షణమే.
నవ్వుతూ ఉండటం అనేది జీవ లక్షణం. విశ్రాంతి సమయం లో పద్దతులు, ప్రణాళికలు ఉండవు. విరామమే విస్తరించి వుంటుంది.
ఒక గొప్ప జెన్ గురువు ఉండేవాడు.
ఆయనకు దేశం లో ఎంతో గొప్ప పేరు ఉండేది.
చైనా దేశ చక్రవర్తి కూడా ఆయన పట్ల భక్తి ప్రవత్తులు ప్రదర్శించే వాడు.
ఒకసారి చక్రవర్తి కి ఆ జెన్ గురువును చూడాలన్న కోరిక కలిగింది. వెంటనే మంది మార్బలం తో గురువు గారి ఆశ్రమానికి వెళ్ళాడు.
ఆశ్రమం లో ప్రవేశించాడు. అక్కడి దృశ్యం చూసి చక్రవర్తి నిశ్చేష్టుడయిపోయాడు. ఆయనకి నోట మాట రాలేదు. తనెక్కడికి వచ్చాడు? పవిత్రమయిన ఆశ్రమాని కేనా? అని ఆశ్చర్యపోయాడు.
ఆశ్రమం లో గురువు నేల మీద పడి దొర్లుతూ బిగ్గరగా నవ్వుతున్నాడు. శిష్యులు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు.
గురువు ఏదయినా ఛలోక్తి చెప్పి ఉండాలి. లేదా శిష్యుడు ఎవరయినా ఏదో నవ్వు పుట్టించేది చెప్పి ఉండాలి.
ఏది ఏమయినా చక్రవర్తి కి చాలా ఇబ్బంది కలిగింది.
చిరాకు వేసింది. తన కళ్లను తానే నమ్మలేక పోయాడు.
ఎందుకంటే అక్కడి వాతావరణం లో గంభీరత లేదు. ఆశ్రమ పవిత్రత లేదు. ఆ విషయాన్ని రాజు గారు గురువు తోనే సూటిగా చెప్పేశాడు.
“ఇది అమర్యాదకరం గా ఉంది. మీలాంటి గురువు నుండి ఇది ఊహించ లేకుండా ఉన్నాను. గౌరవనీయమైన ప్రవర్తన మీరే నేర్పాలి. అట్లాంటిది మీరే నేలమీద పడి దొర్లుతున్నారు. పిచ్చివాడిలా పగలబడి నవ్వుతున్నారు. మీ శిష్యులంతా మీతో కలిసి అల్లరి చేస్తున్నారు” అన్నాడు.
గురువు చక్రవర్తి ని చూశాడు. గురువు ఏం సమాధానం చెబుతాడా? అని చక్రవర్తి చూశాడు.
గురువు చక్రవర్తి విళ్ళంబులు ధరించి ఉండటం చూశాడు.
ప్రాచీన కాలం లో రాజులకు ఆనవాయితి.
గురువు “చక్రవర్తి గారూ! నాకో విషయం చెప్పండి. మీరు ఈ వింటిని ఎప్పుడూ సంధించి. అప్రమత్తం గా ఉంటారా? లేక మామూలుగా భుజానికి తగిలించుకుంటారా? అని అడిగాడు.
చక్రవర్తి “దాన్ని అవసరం అయినప్పుడు సంధిస్తాం. ఎప్పుడూ సంధించి పెడితే అది సాగే గుణాన్ని కోల్పోతుంది. వదులవుతుంది. అప్పుడేందుకూ పనికి రాదు. దాని విశ్రాంతిగా వాడలాలి. ఎప్ప్దుడు కావాలో అప్పుడు సంధించి వదలాలి.” అన్నాడు.
రాజు గారూ చెప్పిన మాటలు గురువు శ్రద్ధగా విన్నాడు.
గురువు ఒకే మాట్లో సమాధానం చెప్పాడు.
“నేను చేస్తున్నదీ అదే కదా?”
(ఓషో తన బోధనలలో చెప్పిన చిన్న కధ)

Saturday 18 November 2017

పరిగెత్తిన ముసలావిడ

మహారాష్ట్ర బుల్ఢానా జిల్లా లో ని ఒక చిన్న కు గ్రామం లో ఉండే 65 ఏళ్ల లతమ్మ (లతా భగవాన్ ఖరే) తన భర్త, ముగ్గురు ఆడపిల్లలతో జీవిస్తూ ఉండేది.
ఆదంపతులు ముగ్గురి ఆడపిల్లకి పెళ్లిళ్లు చేశారు. ఏళ్ల తరబడి పొదుపు చేసుకున్న డబ్బు హరించుకు పోయింది. అందినంతవరకు చేసిన అప్పులు మిగిలాయి.
కాయ కష్టం చేసి ఋణ విముక్తులు కావటానికి శ్రమిస్తున్న ఆ జంటకి అనుకోకుండా ఒక విపత్తు వచ్చి పడింది.
దాని పేరు అనారోగ్యం
ఒకరోజు  నలతగా ఉందని చెప్పాడు.
స్థానికంగా అందుబాటు లో ఉన్న మెడికల్ ప్రాక్టిషనర్ ఏదో ఇన్ఫెక్షన్ సోకిందని పెద్ద ఆసుపత్రి లో చూయించాల్సిందే నని చెప్పాడు.
లతమ్మ కి నెత్తిన పిడుగు పడ్డట్టు అయింది. అసలే ఇద్దరు రాత్రింబగళ్ళు చాకిరీ చేస్తే తప్ప పోయిల్లో పిల్లి లేవని స్థితి. ఇప్పుడు ఆసుపత్రి అంటే డబ్బులు?
చేతి లో చిల్లిగవ్వ లేని స్థితిలో లతమ్మ కి ఏమి చెయ్యాలో పాలు పోలేదు.
దగ్గరలో ఉన్న ప్రబుత్వ ఆసుపత్రికి అతన్ని తీసుకువెళ్లింది. రెండు రోజుల్లోనే  నడవలేని స్థితికి వచ్చాడు.
ప్రభుత్వ అసుపత్రి లో సరయిన సదుపాయాలు లేవు. రోగ నిర్ధారణ కి కీలకమయిన పరీక్షలు చేయాల్సి వచ్చింది. బారామతి లో ని 'టెర్మినల్ హాస్పిటల్' కి వెళ్ళి కీలకమయిన టెస్ట్లు చేయించడం అత్యవసరం అని చెప్పారు.
లతమ్మ కి దుఖం ఒక్కటే మిగిలింగి. తన దౌర్భాగ్యానికి బాధ పడింది.  పరిస్థితి పూట పూటకి దిగజారి పోతూ ఉంది
తన భర్త తన చేతుల్లో చనిపోవటం అనే 'ఉహే' ఆమెని కుదిపేసింది.
నిస్సహాయం గా రోదించింది.
మౌనంగా ఉండటానికి కానీ, మొహమాట పడటానికి కానీ ఇది సమయం కాదని ఆమె గ్రహించింది.
వెంటనే చుట్టూ పక్కల వారిని, బంధు మిత్రులని కొంగు చాచి సాయం అడిగింది. మనసున్న మారాజులు అందించిన కొద్దిపాటి సాయం తో భర్తని బారామతి హాస్పిటల్ కి తీసుకెళ్లింది.
అక్కడి డాక్టర్లు అతన్ని చెక్ అప్ కి రిఫర్ చేశారు.
వరండాలో ఆమె దీనంగా కూర్చుని ఉంది. తన ఇంటి దీపాన్ని ఆర్ప వద్దని కనబడని దేవుళ్లందరికి మొక్కుతూ ఉంది. కానీ తలచినది జరిగితే విధి గొప్పతనం ఏముంది??.
ఆ టెస్ట్ లు చాల్లేదు. MRI చేయించాలి మరి కొన్ని ఖరీదయిన పరీక్షలు చేయిస్తే కానీ జబ్బు నిర్ధారణ చెయ్యలేమని తేల్చి చెప్పేశారు.
లతమ్మ ఏడుపు ఆపుకోలేక పోయింది. అయిపోయింది తన మాంగల్యం తన కళ్ల ముందే కోడిగొట్టబోతుంది. చేతిలో పైసా లేదు. ఇంకా ఖరీదయిన పరీక్షలు? ఆమె కన్నీళ్లు ఆమె మాట వినటం లేదు. బోరున ఏడువ సాగింది.
ఆ రాత్రి ఆసుపత్రి వరండా లో పడుకుండి పోయారు. భర్త ఆకలి గా ఉందన్నాడు.
ఆమె ఆసుపత్రి బయటకి వచ్చి వీది చివర ఉన్న చిన్న అంగడి లో తన వద్ద ఉన్న చిల్లర తో రెండు సమోసా తీసుకుంది. గబ గబా నడిచి వచ్చి భర్త కి ఇచ్చింది నేను తిన్నాను నువ్వు తినేయ్ అంది.
సమోసా చుట్టిన కాగితం పారవేయ్య బోతూ మరాఠీ లో పెద్ద అక్షరాలతో ఉన్న ప్రకటన చూసింది. . బారామతి మారథాన్ గెలవండి_3000 వేలు నగదు పొందండిఅని ఉన్నది.
ఆమె మనసులో అనేక ఆలోచనలు చేసింది. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచనలతో సతమత మయ్యింది. ఒక నిర్ణయానికి వచ్చింది.
***
మర్నాడు 19-12-2013 'బారామతి మారథాన్' మొదలవబోతూ ఉంది.
పోటీ దారులు అందరూ స్పొర్ట్స్ బట్టలు, బూట్లు కట్టుకుని సిద్దంగా ఉన్నారు.
9
గజాల నేత చీర కల్లుకుని, కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేకుండా,
తడి కళ్ల తో నిలబడ్డ 65 ఏళ్ల లతమ్మ పోటీ లో పోల్గొనటానికి అనుమతి అడిగినప్పుడు అందరూ ఆమెని పిచ్చి దానిలా చూశారు . ఆమె ని పోటీకి అంగీకరించలేదు.
కానీ ఆమె పట్టు విడవలేదు. వాళ్ళతో వాదించింది.
ప్రాదేయపడింది. బ్రతిమాలింది.
చివరికి అబ్యర్దిగా రంగం లోకి దిగింది.
***
పోటీ మొదలయ్యింది. లతమ్మ చీర నుండి కాళ్ళు బయటకి లాగింది.
ఉడుములా పరిగెత్త సాగింది. ఆమెకి తన వయసుగాని రోడ్డున కాళ్ళకి గుచ్చుకుంటున్న, రాళ్ళు కాని, ఎర్రటి ఎండ కానీ, తెలీదు. తెలిసిందల్లా తను గెలవాలి మూడు వేలు తీసుకోవాలి
భర్తకి టెస్టు లు చేయించాలి సరైన వైద్యం చేయించాలి.
తన భర్త బతకాలి. తన కి జీవితాంతం తోడు ఉండాలి.
అదే లక్షం.
అదే వేగం.
అదే పరుగు.
అదే విజయం.
బారామతి మారథాన్ ఒక చరిత్ర .. బారామతి ప్రజలకి ఒక గొప్ప అదృష్టం.
ప్రజలు చప్పట్లు తో వెంట రాగా ఆమె మారథాన్ నెగ్గింది.
నిర్వాహకులు ఆమె కన్నీటి గాధ విని చలించి పోయారు.
సీనియర్ సిటిజన్ విభాగం లో ప్రైజ్ మని ని 5000 గా చేసి అందించారు.
ఆమె ఆ డబ్బుతో తిరిగి ఆసుపత్రికి పరిగెట్టింది.
***
ఆమె ప్రేమ ఊరికే పోలేదు. ఆమె లక్షం ముందు సమస్య చిన్న బోయింది.
భర్త కి మెరుగైన వైద్యం అందింది.


అన్నీ పత్రికలు లతమ్మ గురించి గొప్పగా వ్రాసాయి.
దేశం నలుమూల నుండి ప్రశంశలు వెల్లువెత్తాయి.
నెల తిరిగే సరికి ఎవరో తెలియని వ్యక్తుల నుండి ఆమె బాంకు ఖాతాకి 1,75,000 పైగా పొగయ్యాయి.

ఆ కుటుంబం అన్నీ విదాలా గట్టెక్కింది.
ఆసాద్యాన్ని పట్టుదలతో సుసాద్యం చేసిన 'లతా భగవాన్ ఖరే' అందరికీ ఆదర్శం.
భర్త ని కాపాడుకున్న ఆమె ఒక నిజమయిన ప్రేమ మూర్తి.

Wednesday 15 November 2017

వక్క పొడి


“అబద్దాలు ఆడటం అనేది పిల్లలకి మనమే నేర్పుతాం. కాపీ పుస్తకం లో అబద్దం ఆడరాదు అని రాయిస్తాం. వెంకట్రావు అంకుల్ వస్తే మా నాన్న ఇంట్లో లేడు అని చెప్పమని కూడా మనమే చెబుతాం.”
బస్సులో పక్క సీటు అతనికి మాత్రమే చెబుతున్నాడు కానీ. 
ప్రశాంతంగా సిటింగు మించని బస్సులో అందరికీ బోర్డు మీద వ్రాసి,
పాఠం చెబుతున్నంత కమాండింగా ఉన్నది అతని వాయిస్.
ఈపాటికే అమరావతి బోటు ప్రమాదానికి కారణాలు విశ్లేషించి,
నివారణకి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమేం చెయ్యాలో,
ప్రజానీకం ఎవరెవరి కాలర్లు పట్టుకుని ఎలా నిలదీయ్యాలో
ఒక పావుగంట పాటు చెప్పి ఉన్నాడు.
సింగిల్ టీచర్ పిల్లలకి అన్నీ సబ్జెక్ట్లు చెప్పినట్లు మరో టాపిక్ లోకి వెళ్ళి ధారాళంగా మాట్లాడుతున్నాడు.
అప్పుడప్పుడే చిక్కబడుతున్న చీకటిని చీల్చుకుంటూ బస్సు..
చీమకుర్తి దాటి వెళ్తూ ఉంది.
చాలాకాలం సెలవు పెట్టి తిరిగి జాయిన్ అయ్యాక సిలబస్ మొత్తం చెప్పేయ్యాలి
అన్నంత ఆత్రంగా మాట్లాడుతున్నాడు.
“అసలు అబద్దం అనేది మన సంస్కృతి కాదు. ఒక అబద్దాన్ని కప్పిపుచ్చటానికి అనేక జి‌బి ల మెమొరీ వృదా చేసుకోవాలి. అంత జ్నాపక శక్తిని ఏదైనా పనికొచ్చే విషయం మీద కేటాయిస్తే బోలెడు ఉపయోగం. చిన్నదే కదా అని అశ్రద్ద చేస్తే అదే పెరిగి అబద్దం జన్మహక్కు అంటారే అలా అయిపోతుంది. వాడేవాడో చివర్లో ఉరిశిక్ష పడ్డాక చివరి కోరికగా తల్లి ని పిలిచి, చెవి కొరికి గోంగూర కట్ట దొంగిలించినప్పుడే ఎందుకు దండిచలేదు అని అడిగాడట.. అలా అవుతుంది.”
పక్క సీటు లో పెద్దాయన నోట్లో వక్క పొడి ఉందో లేదో కానీ, దవడలు ఆడిస్తూ ఉన్నాడు.
మద్య మద్యలో వింటున్నట్టు ఆతగాడి వైపు చూసి మొహమాటపు నవ్వు నవ్వుతున్నాడు.
ఇలాటి వాగుడు కాయ ల నుండి కాపాడుకోటానికయినా సరే దేవుడు చెవులకి రెప్పలు ఇచ్చి ఉంటే బాగుందనిపించింది.
మరో అరగంట కి తిరుమల వెంకన్న దర్శనం అయినట్లు ఒంగోలు చేరినట్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కనిపించింది. బైపాస్ లో దిగటానికి లేచి బాగ్ తీసుకుంటుంటే...
వాగుడు కాయ కి ఫోన్ వచ్చింది.
“ఇంకా... చీమకుర్తి రాలేదే.. ఇంకో గంట పడుతుంది ఇంటికి వచ్చే సరికి “ అని చెప్పాడు. ఫోన్ లో గట్టిగా...
“ఈ టీట్ణీలు నాదగ్గర కుదరదు.. నేరుగా ఇంటికి రా.. ఇవాళ కూడా తాగి వచ్చావో *%$” అటునుండి ఫోన్ లో ఆడగొంతు మొరటుగా వినబడింది.
వాగుడు కాయ పక్క సీటు ఆయన లేచి కిటికీ లోనుండి నోట్లో వక్క పొడి “థూ “ అని ఊచాడు.
బస్సు స్లో అయ్యింది.

Tuesday 14 November 2017

తియ్యటి లడ్డు

ఒక్కోసారి అనుకోకుండా కొన్ని వేదికలు పంచుకోవాల్సి వస్తుంది.
“చినమనగుండం” అనే ఒక మారుమూల ఊరికి వృతి రీత్యా ఈ ఉదయం వెళ్లినప్పుడు ఆ గ్రామ సర్పంచ్ నేను గ్రామం లోకి వచ్చానని తెలుసుకుని అక్కడి ఎలిమెంటరీ స్కూల్ లో జరిగే బాలల దినోత్సవానికి అతిదిగా ఆహ్వానించాడు.
నాకు గంట పైగా లేటు ఉందని మీరు కొనసాగించండి వీలుంటే వచ్చి కనబడతానని చెప్పాను.
కానీ నా కోసం కార్యక్రమం ప్రారంభం చేయలేదని తెలిసి వెంటనే వెళ్ళాను.
చిన్న చిన్న పిల్లలు, బుగ్గలమీద పౌడర్, కొత్త రిబ్బన్లు, పెట్టెలో దాచిన మడతల బట్టలు, నూనె పూసి దువ్విన తలలు ముగ్గురు టీచర్లు, సర్పంచ్, మరో ఇద్దరు అతిదులు సిద్దంగా ఉన్నారు.
పిల్లలని చూస్తే ముచ్చటేసింది. వాళ్ళని సిద్దం చేయించిన టీచర్లు ని అభినందించాను.
ప్రధానోపాద్యాయుడు చక్కగా పరిచయం చేశాడు. వక్తలు పిల్లలు వయసుని గమనించకుండాను, టీచర్లు హిస్టరీ పాటం బోదిస్తున్నట్టుగాను మాట్లాడారు.
నా వంతు వచ్చే సరికి చిన్న పిల్లల కి ఏమి చెప్పాలో ఒక్క క్షణం స్పురించలేదు.
ప్రశ్న సమాదానం లాగా నేను మాట్లాడటం మొదలెట్టాను.
మీరందరికి పార్కు అంటే తెలుసా?
తెలుసు
అక్కడ ఏమి ఉంటాయి?
చెట్లు, ఇంకా పక్షులు ..
ఇంకా?
నీళ్ళ గుంటలు..
కదా? ఒక సారి ఒక పిల్లాడు ఆ పార్కు లో నుండి ఇంటికి వెళుతూ ఉంటే ఆ నీళ్ళలో ఒక మెరుస్తున్న ఉంగరం కనిపించింది. ఉంగరం అంటే తెలుసా?
తెలుసు .. తెలుసు ..
(ఒకసారి ఎఫ్‌బి లో వ్రాసిన గుర్తు. పిల్లలకి అనుకూలంగా మార్చి చెప్పాను)
ఇలా మొదలెట్టి నేను చెప్పదలుచుకున్న విషయం చెప్పేశాను.
వారి వద్ద సెలవు తీసుకుని నా బండి వద్దకి నడుస్తుంటే .. ఒక చిన్న పిల్ల ఆరేడు ఏళ్ళు ఉంటాయి.. పరిగెట్టుకుంటూ వచ్చి .. తనకి ఇచ్చిన 'బూందీ లడ్డు' పొట్లం లోనుండి ఒక లడ్డు ముక్క తుంచి నా చేతిలో పెట్టింది.
అంత తియ్యటి లడ్డు నేనెప్పుడూ గతం లో తిన్న గుర్తు లేదు. 

Tuesday 7 November 2017

అతీంద్రీయ శక్తి

పంకజానికి అతీంద్రీయ శక్తులు ఉన్నట్లు రామకృష్ణకి గత రాత్రి అర్ధమయింది.

గదిలో వేడి చల్లబడ్డాక ?  బాల్కనీ లో చల్లగాలిలో ఒక దమ్ము లాగి పడక గది లోకి వెళ్ళినప్పుడు

 ముసుగు తన్ని పడుకున్న 'పంకజం' నుండి ఒక వింత వెలుగు రావటం గమనించాడు.
...
కొద్దీ నిమిషాలు ఏం తోచలేదు. భయం వేసింది. హాల్లో కి వెళ్లి, ల్యాప్టాప్ ఆన్ చేసి  తన గురువు  కిషోర్ తో స్కైప్ కలిపాడు. 
భయం భయం గా జరిగిన విషయం చెప్పాడు.
...
అప్పటి దాకా హౌస్ కీపింగ్ చేసి అలసిపోయిన కిషోర్. " ఓరి నాయనా నీ మొబైల్ లో వాట్స్ ఆప్ చెక్ చేస్తూ వుండి ఉంటుంది. నెరమూ శిక్ష రెండో భాగంలో ఉన్నాను నేను"

Sunday 5 November 2017

ఎటు కూడినా సమానంగా!

మరో చిన్న పజిల్
మొదటి చిత్రం లో చూపించినట్లు ఒక 9x9 చట్రం ఉంది 

అటుచూసినా 9 ఖాళీ గదులు ఉన్న పజిల్. అంటే మొత్తం 9x9 గదులు = 81 గదులు ఉన్న పెట్టె.
1 నుండి మొదలెట్టి చివరి గది వరకు వరస సంఖ్యలు వ్రాస్తే మొత్తం 81 అంకెలు తో మొత్తం గదులు నింపవచ్చు. 
అలా నింపిన చిత్రం 2 లో చూడండి. అడ్డంగా ఉన్న 9 అంకెలని, నిలువుగా ఉన్న 9 అంకెలని ఐ మూలలుగా ఉన్న అంకెలని ఎటు కూడినా సమానంగా 369 వచ్చేట్టుగా అమర్చాలి.
ఎంత తక్కువ సమయం లో మీరు అమర్చగలరు. దానికి ఏదయినా శాస్త్రీయ పద్దతి ఉన్నదా? ఉంటే ఏమిటి ? ఎవరయినా try చేయండి.
ఐ‌ఐ‌టి లలో చదివినవారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఉన్నత చదువులు చదివిన పెద్దవారు కూడా నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నారు. ఇది సామాన్యుల కోసం అని దయచేసి గ్రహించండి.
( 1 నుండి 81 వరకు అంకెల మొత్తం N * (N+1)/2 అని మనకి తెలుసు అంటే 81x82/2 = 3321. వీటిని తొమ్మిది వరసల్లో సర్దినప్పుడు ఒక్కో వరసకి 3321/9 =369 వస్తుంది. అంతే కదా??)
ప్రయత్నించండి. కొద్దిసేపు సిన్సియర్ గా ప్రయత్నం చేస్తే చక్కటి నిద్ర వస్తుంది. మెదడు అలిసిపోయినప్పుడు అలాటి ఘాడ మయిన నిద్ర వస్తుంది. 
(ఇది నేను ‘యాకోవ్ పెరల్మాన్’ వ్రాసిన పుస్తకం లో దాదాపు ఇరవై అయిదేళ్ళ క్రితం చూసి నేర్చుకున్నాను)
ఫోటో వివరణ ఇచ్చాను. అర్ధం చేసుకోటానికి వీలుగా చూడండి. 






ముందే తెలిసిన మొత్తం

ఎఫ్‌బి లో తొమ్మిది అంకె గురించి ఒక చర్చ నడిచింది. ఈ సందర్భం గా కొన్ని 9 తో తమాషాలు గుర్తుకు వచ్చాయి 
వాటిలో ఒకటి. 
టీచర్ ఒక నాలుగు అంకెల సంఖ్యను బోర్డ్ మీద ఒక విద్యార్ధి ని వేయమంటాడు.
ఉదాహరణకి 4268 అనుకుందాం. 
ఒక కాగితం మీద ఏదో ఒకటి వ్రాసి మడిచి అదే విద్యార్ధి జేబులో పెడతాడు. తను చెప్పేంత వరకు మడత విప్పి చూడవద్దు అని చెబుతాడు. 
మరో విద్యార్ధి చేత మరో నాలుగంకెల సంఖ్య మొదటి సంఖ్య కిందనే వ్రాయమంటాడు. 
ఉదా హరణ కి 8762 అనుకుందాం. 
అప్పుడు టీచర్ ఒక సంఖ్యని తను వరుసలో వ్రాస్తాడు. 
ఉదాహరణకి 1237 అనుకుందాం. 
మరో విద్యార్ధి చేత మరో సంఖ్య 5340 అనుకుందాం. 
మళ్ళీ తను 4659 అనే అంకె వేసి, మొదటి సంఖ్య వ్రాసిన విద్యార్ధిని కూడమంటాడు.
4268
8762
1237
5340
4659
--------
24266
అనే సమాధానం వస్తుంది.
ఇప్పుడు టీచరు ఇచ్చిన కాగితం మడత విప్పి చూస్తే 24266 అనే సంఖ్య వ్రాసి ఉంటుంది.
పిల్లలని సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తే ఈ తమాషా ని విధ్యార్డుల ని లెక్కల పట్ల అనురక్తి కలిగించడం కోసం వాడుకోవచ్చు.
ఇది ఒక '9' మాజిక్. పెద్దలకి అర్ధం అయి ఉంటుందని తలుస్తున్నాను. 

శకుంతలా దేవి

అతను సాంప్రదాయ కన్నడ భ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు.
కుటుంబ ఆచారం ప్రకారం గుడిలో పూజారి గా స్థిరపడటాన్ని వ్యతిరేకించాడు.
మెజీషియన్ గా అవతరించాడు.
భుక్తి కోసం ఒక సర్కస్ కంపెనీ లో జంతువుల ట్రైనర్ గా, మెజీషియన్ గా వివిద పనులు చేసేవాడు. ఉయ్యాల నుండి గాలిలో పల్టీలు కొట్టి మరో ఉయ్యాల పట్టుకునే విన్యాసాలు చేసేవాడు. (Trapeze)
1929 నంవంబరు 4 వ తేదీ ఒక చక్కటి ఆడపిల్లకి తండ్రి అయ్యాడు.
తనతో పాటే సర్కస్ లో తిరుగుతుండే చిన్నారికి మూడేళ్ళ వయసులో ప్లేయింగ్ కార్డ్స్ తో ఒక చిన్న మాజిక్ నేర్పే టానికి ప్రయత్నించినప్పుడు తన కూతురికి అంకెలని అద్భుతంగా జ్నాపకం పెట్టుకునే శక్తి ఉందని గ్రహించాడు.
అతను సర్కస్ లో పని మానేశాడు. అనేక చోట్ల కుమార్తె తో కలిసి మేజిక్ లెక్కలతో కలిపి ప్రదర్శనలు ఇచ్చేవాడు. కుమార్తె కి ఉన్న శక్తి ని పరిపూర్ణంగా ప్రోత్చహించాడు.
ఆమె తన గణన శక్తి ని యూనివర్శిటీ ఆఫ్ మైసూర్ లో ప్రదర్శించింది. అప్పటికి ఆ బుడ్డ దాని వయసు నిండా ఆరేళ్లు!!.
తన పేరు శకుంతలా దేవి.
అది ప్రారంభం.
1944 లో ఆమెకి పదిహేనేళ్ళ వయసప్పుడు తండ్రి తో కలిసి లండన్ చేరింది.
ఆమె తన అర్ధమేటిక్ జ్ణానాన్ని అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తూ యూరప్, న్యూ యార్క్ లు పర్యటిస్తూ ఉండేది.
Arthur Jensen, అనే సైకాలజీ ప్రోఫ్ఫెసర్ (University of California, Berkeley ) ఆమెను అనేక సమస్యలకి సమాధానాలు రాబట్టాడు. అతని అసిస్టెంట్స్ ఆయన ఆడిగిన సమస్యని వ్రాసేలోగా ఆమె సమాదానం తో సిద్దం గా ఉండేది.
61,629,875 కి క్యూబ్ రూట్, 170,859,375 కి సెవెన్త్ రూట్ ఆయన నోట్ బుక్ లో వ్రాసేలోగా 395, 15 అని సమాదానం చెప్పింది. 1990 లో Intelligence అనే పత్రిక లో వీటిని ప్రొఫెసర్ పొందుపరిచారు.
1977 లో Southern Methodist University, లో జరిగిన ఒక ప్రదర్శనలో 201 అంకెల సంఖ్యకి 23వ క్యూబ్ రూట్ ఆమె 50 సెకండ్ల లో చెప్పేసింది. అప్పట్లో అత్యంత వేగమయిన UNIVAC 1101 కంప్యూటర్ లో ప్రత్యేక ప్రోగ్రాం వ్రాసి , సమాదానాన్ని నిర్ధారించుకోవలసి వచ్చింది.
1980 లో Imperial College London. వారు నిర్వహించిన ఒక కార్యక్రమం లో రెండు పదమూడు అంకెల లబ్దాన్ని 28 సెకండ్ల లో చెప్పి ఆందరి ని ఆశ్చర్యపరిచింది. 1982 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఇది నమోదయ్యింది.
(7,686,369,774,870 × 2,465,099,745,779=18,947,668,177,995,426,462,773,730)
ఫిగరింగ్, ది జాయ్ ఒఫ్ కౌంటింగ్ అనే ఆమె వ్రాసిన పుస్తకాలలో అనేకి కీలక విషయాలు ప్రపంచానికి తెలియపరిచింది.
1960 ప్రాంతాలలో ఇండియా తిరిగి వచ్చిన ఆవిడ ఒక ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ ని వివాహం చేసుకుని. 1979 లో 50 ఏళ్ల వయసులో విడాకులు తీసుకుంది.
తమాషా ఏమిటంటే 1977 లో ‘హోమో సెక్సువాలిటీ’ మీద ఆమె తన తొలి రచన చేసింది. దీనికి కారణం ఒక చీకటి కోణం.
1980 లో ఇండిపెండెంట్ అబ్యర్ధిగా ఇందిరా గాంధీ మీద పోటీ చేసింది. (ఇందిర నుండి మెదక్ ప్రజలని ని కాపాడటానికి అని ఇంటర్వ్యూ లలో చెప్పింది. ) చివరి రోజుల్లో ఆమె ఆస్ట్రాలజీ లో కూడా ప్రావీణ్యం ఉందని నిరూపించుకున్నారు.
21-04-2013 న బెంగుళూరు లో కుమార్తె అనుపమ కేర్ టేకింగ్ లో శ్వాసకోశ ఇబ్బందులతో 83 ఏండ్ల గణిత మేధావి తన జ్ణాపకం గా అనేక గ్రంధాలు మిగిల్చి బౌతికంగా ‘సైపర్’ (cypher) ఆయిపోయారు.
4, నవంబర్ 2013 న గూగుల్ ఆమె 84 పుట్టిన రోజు సందర్భంగా ఒక చిత్రాన్ని ప్రదర్శించింది. 



ఆమె వ్రాసిన కొన్న పుస్తకాలు:
• Astrology for You (New Delhi: Orient, 2005). ISBN 978-81-222-0067-6
• Book of Numbers (New Delhi: Orient, 2006). ISBN 978-81-222-0006-5
• Figuring: The Joy of Numbers (New York: Harper & Row, 1977), ISBN 978-0-06-011069-7, OCLC 4228589
• In the Wonderland of Numbers (New Delhi: Orient, 2006). ISBN 978-81-222-0399-8
• Mathability: Awaken the Math Genius in Your Child (New Delhi: Orient, 2005). ISBN 978-81-222-0316-5
• More Puzzles to Puzzle You (New Delhi: Orient, 2006). ISBN 978-81-222-0048-5
• Perfect Murder (New Delhi: Orient, 1976), OCLC 3432320
• Puzzles to Puzzle You (New Delhi: Orient, 2005). ISBN 978-81-222-0014-0
• Super Memory: It Can Be Yours (New Delhi: Orient, 2011). ISBN 978-81-222-0507-7; (Sydney: New Holland, 2012). ISBN 978-1-74257-240-6, OCLC 781171515
• The World of Homosexuals (Vikas Publishing House, 1977), ISBN 978-0706904789[11][21]

Tuesday 31 October 2017

వెంకట్రామయ్య ఫోన్

ఈ ఉదయమే గుర్తుచేసింది. రేపు ఒకటో తేదీ అని.
నేను నవ్వాను.
“అయితే?” అన్నాను తనేమంటుందో నని.
“ఈ నెల తప్పదు. నల్ల పూసల దండ ఆర్డర్ ఇవ్వాల్సిందే.” అంది.
అసలు తప్పంతా నాదే. ఏదో బలహీన క్షణం లో పల్లెటూర్లో ఒకావిడ మెడలో చూసిన పాత కాలం నాటి దండ మోడల్ బాగుందని నీకయితే ఇంకా బాగుంటదని నోరు జారాను. పైగా ఒక కాగితం మీద గీసి చూపించాను.
మొన్నా మద్య బంగారం కొట్లో వాళ్ళకి చెప్పి ‘లచ్చాలు’ డిజైన్ అని తేల్చి పారేసింది.
ఖచ్చితంగా తన పుట్టినరోజు కి చేయించాలని షరతు కూడా ఉంచింది.
"చూద్దాం" .. అంటూ ఆఫీస్ కి బయలు దేరాను.
నెలాఖరు మీటింగులు చూసుకుని లేటుగా వచ్చాను.
ఫ్రెష్ అవగానే “వెంకట్రామయ్య ఫోన్ చేశాడు” అంది ఏ ఉపోద్గాతము లేకుండా.
చక్కటి, చిక్కటి టీ త్రాగుతూ.. “ఫోన్ చేసివ్వు.. నేను మాట్లాతాను” అని చెప్పాను.
వెంకటరామయ్య మా స్నేహితుడు. దేవారం అనే పల్లెటూర్లో ఉండి సిన్సియర్ గా సేద్యం చేసుకునే రైతు. మనం గొప్ప అనుకునే చదువు మాత్రమే లేని గొప్ప సంస్కారి.

“ఏం . వెంకట్రామయ్యా ఫోన్ చేసావంట.. “
“అన్నాయ్.. పొలం పనులు మొదలయ్యాయి.” చెప్పాడతను . రెండు నిమిషాలు మాట్లాడి
“నేను రెండు రోజుల్లో ఫోన్ చేస్తాను” అని చెప్పి ఫోన్ మా ఆవిడకి ఇచ్చాను.
మా కుటుంబానికి ఉన్న ఆత్మ బందువులలో అతనొకడు.
“ముందు వెంకట్రామయ్య అవసరం చూడండి. గోల్డ్ షాప్ కి మరో నెలలో వెళ్లొచ్చు” పది నిమిషాల తర్వాత నాతో అంది మా ఆవిడ.

Saturday 28 October 2017

వారి సమస్య

మౌనం, చిరునవ్వు విలువైనవి.
చిరునవ్వు సమస్యలని పరిష్కరిస్తే , మౌనం సమస్యలను దూరం గా ఉంచుతుంది.
విజయాన్ని చూసిన వ్యక్తుల పెదవుల మీద వీటి చిరునామా.
చక్కెర, ఉప్పు ని కలిపి ఉంచినా చీమలు తీపినే తీసుకువెళ్తాయి.
సరైన వ్యక్తులని జీవితం లోకి ఆహ్వానించండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండీ. 
పుట్టుక ద్వారా వచ్చినవి మాత్రమే మన చేతిలో లేవు. మిగిలిన మొత్తం మన చేతిలో నే ఉంది.
మన కలలని సాకారం చేసుకోలేనప్పుడు మన మార్గాలు మార్చుకుందాం. ‘గమ్యం’ ని కాదు.
ప్రకృతి లో జరిగేది ఇదే. చెట్లు ఆకులని మార్చుకుంటాయి ‘వేర్ల’ ని కాదు.
మోరిగే ప్రతి కుక్క మీద రాళ్ళు వేసుకుంటూ వెళితే.. చివరికి మనకు అది మాత్రమే చాతనవుతుంది.
విమర్శకులు ఎప్పుడూ ఉంటారు. మనం నీళ్ళ మీద నడిచేటప్పుడు వాళ్ళు మనకి ఈత రాదని గేలి చేస్తారు.
ఎవరయినా అసూయ చెందారు అంటే మనం విజయం వైపు ప్రయాణిస్తున్నట్టు
‘పంది’ తో పోట్లాట మనన్ని బురదలోకి లాగుతుంది. పైగా దానికి అది ఆనందాన్ని ఇస్తుంది.
సన్మార్గం లో జీవించడం, సమాజం గురించి భాద్యత తీసుకోవటం, నచ్చిన పనిని స్వయం గా చేయటం, జీవితాలని పరిపూర్ణం చేస్తాయి.
ఈ రోజు మంచి రోజు... మనకి మిగిలిన ప్రతి రోజు మంచి రోజే. పిల్ల వాడు మధురమయిన మామిడికాయను ఆస్వాదించినట్లు జీవితాన్ని అనుభవిద్దాం. మనం మరొకరికి నచ్చక పోవటం అనేది వారి సమస్య. మనది కాదు. వారి సమస్య కోసం మన సమయం వృధా చేసుకునేంత అవివేకం మనకి వద్దు.
నా ఆత్మీయ మిత్రులకి శుభోదయం. _/][\_

Friday 27 October 2017

హస్త వాసి

'టెన్నిస్ ఎల్బో' నుండి చాలావరకు బయట పడ్డాను.
పరిస్తితి చాలా మెరుగ్గా ఉంది. ఆర్ధో డాక్టర్ OP (నెల రోజులు) గడువు ఇంకా ఉంది కదా అని హాస్పిటల్ కి వెళ్ళాను. 
ఆయన సర్జరీ లో ఉన్నారు.
వెయిటింగ్ రూమ్ లో ఖాళీ చూసుకుని కూర్చున్నాను..
స్మార్ట్ ఫోను, jio సిమ్ ఎటూ ఉన్నాయిగా??
గంట పైగా కూర్చున్నాను.
కాంపౌండర్ వచ్చి “శ్రీనివాసరావ్.. ఒంగోలు” అని రెండు మూడు సార్లు పిలిచిందాకా గమనించనే లేదు.
హడావిడిగా లెచానా?.. కాలు తిమ్మిరెక్కింది.
అలానే లాక్కుంటూ డాక్టర్ గారి రూము లోకి వెళ్ళాను.
డాక్టర్ గారితో పాత పరిచయం బానే ఉంది. కుశల ప్రశ్నలు, ‘చేతి నొప్పి’ విషయాలు మాట్లాడుకున్నాక ఎక్కువ టైమ్ తీసుకోకుండా ఆయన చెప్పిన జాగర్తలు గుర్తు పెట్టుకుంటూ బయటకి వచ్చాను.
వెయిటింగ్ హల్లో నుండి చక చకా బయటకి నడుస్తుంటే ...
ఎవరో ఒక పెద్దావిడ నా నడకని గమనిస్తూ
“నే చెప్పలా? డాక్టర్ గారి హస్త వాసి చాలా మంచిదని” అనటం వినబడింది.

Tuesday 24 October 2017

తిరుగు టపా

ఇంకో రెండు  నిమిషాల్లో బస్సు బస్టాండ్ కి చేరుతుంది అనగా జరిగిందా సంఘటన.
గట్టిగా పది పన్నెడు ఏళ్ల మద్య ఉంటుందా  పిల్లాడి వయసు. నిలబడ్డ పిల్లాడు నిలబ్డ్డట్టుగా కూలిపోయాడు. పక్కనే ముప్పై  మించని మరో మనిషి, చేతిలో ఉన్న గుడ్డల  సంచి  సర్దుకుని పిల్లాడిని పొదివి పట్టుకున్నాడు.
రాఘవ  కూర్చున్న సీటుకి మూడు అడుగుల దూరం లో  కూలబడ్డ కుర్రాడు స్కూల్ యూనిఫార్మ్ వేసుకుని ఉన్నాడు. కుడి అరచేతి వెనుక ప్లాస్టర్ వేసిన సూది ఉంది.
అప్పటిదాకా  సెల్ లో చాటింగ్ చేస్తున్న రాఘవ చప్పున లేచి పిల్లాడిని లేపటానికి సాయం చేశాడు. పిల్లాడు అపస్మారక స్థితి లోకి జారుకున్నాడు. తోడుగా ఉన్నతను ఏమి అర్ధం కానీ పరిస్తితి లో ఉన్నాడు.
ఎవరో ఒకావిడ హాండ్ బాగ్ నుండి నీళ్ళ సీసా తీసి అరచేతిలో కొంచెం వంపుకుని పిల్లాడి ముఖం తుడిచింది.
“ రేయ్ బాబు” అంటూ కదిలించింది.  ఊహూ ఏమి చలనం లేదు.
“ఏమయింది? “ రాఘవ అడిగాడు.
“నా మేనల్లుడు వీడు. వెలిగొండ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆరో తరగతి. ఉదయం తేలు కుట్టిందట. మార్కాపురం గవర్నమెంట్ ఆసుపత్రికి చేర్చి, మా బావ కి ఫోన్ చేశారు. నేను వెళ్ళాను. తీరా సాయంత్రం నాలుగప్పుడు మా వల్లకాదు ఒంగోలు (వంద కిలోమీటర్ల జిల్లా కేంద్రం) తీసుకెళ్ళండి అని చెప్పారు. తీసుకొస్తున్నాను. RIMS (Govt Hospital) కి తీసుకెళ్లమన్నారు. దుఖం తో గొంతు పూడుకు పోతూ ఉంటే చెప్పాడు. 
ఈ లోగా బస్సు బస్ స్టాండ్ కి చేరింది. పిల్లాడిని నెట్టుకుంటూ పోలో మని జనం దిగేశారు.
రాఘవ అతని వద్ద ఉన్న చేతి సంచి ఒక చేత్తో, మరో చేత్తో పిల్లాడు జారవిడిచిన స్లిప్పర్లు మరో చేత్తో పట్టుకుని బస్సు దిగాడు. “బస్ స్టాండ్ ఎదురుగా వెంకట రమణ హాస్పిటల్ ఉంది అక్కడికి తీసుకెళ్దాం అన్నాడు.”
మేనమామ పిల్లాడిని బుజాన వేసుకుని మొహమాటం గా “రింస్ కి తీసుకు వెళ్తాను” అన్నాడు.
“అంత టైమ్ లేదు. నా మాట విను. డబ్బు కి ఇబ్బంది లేదు నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు” అంటూ చక చక నడవ సాగాడు. తప్పని స్థితి లో పిల్లాడిని బుజాన వేసుకుని వెనకే నడవసాగాడు.
పొద్దుట నుండి ఆహారం లేదు, వంట్లో తేలు నరాల్లో తిరుగుతూ ఉంది. హాస్పిటల్ కి చేరాక పావుగంట లో జెనరల్ వార్డ్ లోకి పిల్లాడిని మార్చడం. ఫ్లూయిడ్స్, ఆంటీ బయటిక్స్ ఇవ్వటం జరిగిపోయాయి. గంటన్నరకి పరిస్తితి లో మార్పు వచ్చింది. పిల్లాడు పలకరిస్తే స్పందించే దశ కి వచ్చాడు.
“బాబు ఏం పేరు?” అడిగాడు రాఘవ.
“ప్ర భా క ర్”
“ఆకలిగా ఉందా ఏమయినా తింటావా?” మళ్ళీ అడిగాడు.
జూనియర్ డాక్టర్ ని అడిగి మైన్ రోడ్డు లోకి వచ్చి ఇడ్లీ పార్సిల్ చేయించుకుని, వాటర్ బాటిల్ కొంటుంటే.. తన ఆఫీస్ బాగ్ లో ఉన్న బాటిల్ గుర్తు వచ్చింది. అవును అందులో ఉంది. అసలు బాగ్ ఎక్కడ?
బస్సులో నుండి బాగ్ తీసుకున్న జ్ణాపకం లేదు.
రాఘవ ఆసుపత్రి లోకి వెళ్ళి ప్రభాకర్ ఇడ్లీ తినేంత వరకు ఉండి, పరిస్తితి మెరుగు పడ్డాక తన ఫోన్ నెంబరు ఇచ్చి బయటకి వచ్చాడు.
రాత్రి పదిన్నర అయింది. నేరుగా బస్టాండ్ కి వెళ్ళి ఎంక్వరి లో డ్యూటి లో ఉన్న స్టాఫ్ “ సర్ నేను ఏడుగంటలకి శ్రీశైలం నుండి వచ్చిన బస్సు లో  వచ్చాను. హడావిడిలో నా బాగ్.. ఆఫీస్ బాగ్ ..”
రాఘవ మాటలు పూర్తి కాక ముందే కౌంటర్ కింద నుండి బాగ్ తీసి పైన పెట్టడతాను. “ఇదేనా?”
“అవును”
“ఎవరో లేడి టీచరు గారు ఇక్కడ ఇచ్చేసి వెళ్లారు. మీకు ఫోన్ చేస్తాను అని చెప్పారు” అన్నాడు.
“థాంక్స్ అంది. ఆమె కి కూడా”
రాఘవ బాగు తీసి చూశాడు. తన ఆఫీసు డైరీ, లంచ్ బాక్సు, అన్నీ సరిగానే ఉన్నాయి. సైడు జీప్పులో ఉండాల్సిన కాష్ తప్ప.
ఉదయాన్నే ఆసుపతికి వెళ్ళి ప్రభాకర్ తో మాట్లాడుతుంటే .. రాఘవ ఫోన్ మోగింది.


“సార్ నేను నిన్న మీతో పాటు బస్సులో ఉన్నాను. మీరు బాగ్ వదిలేసి పిల్లాడితో పాటు పరిగెత్తటం చూశాను. ఎంక్వైరీ లో బాగ్ ఇచ్చాను. తీసుకోండి . డైరీ లో మీ ఫోన్ నెంబరు చూశాను. మీ బాగ్ లో ఉన్న పదిహేడు వేలు తీసి  జాగర్త చేశాను. మీరు ఎక్కడున్నారో చెబితే మా అబ్బాయి  చేత ఇప్పుడే పంపుతాను” 

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...