Friday 24 February 2017

ముగ్గురు పాలేర్లు

రామన్న కి కబురు వెళ్లింది.
వెంకట్రాద్రి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారు హారం ఒకటి మాయమయ్యింది. ‘ఇంటిదొంగ’ పనే అని ఆయన అనుమానం. ఇంట్లో ఉన్న ముగ్గురు పాలేర్లలో ఎవరో ఒకరై ఉంటాడని ఆయన గట్టి నమ్మకం. అదే విషయం రామన్న గారితో చెప్పాడు వెంకటాద్రి.
సాయంత్రం దేవాలయ ప్రాంగణం వద్దకి ఆ ముగ్గురిని పంపమని చెప్పాడాయన.
శివరాత్రి జాగారం చేయటానికి దేవాలయం వద్ద పొగయిన ప్రజలని ఉద్దేశించి కొన్ని నీతి కధలు చెబుతున్నాడాయన.
ముగ్గురు పాలేర్లు రావడం గమనించి వారిని ఒక పక్క కూర్చుని చెప్పే విషయాలు శ్రద్ధగా వినమని రామన్న సైగ చేయటం వారు కూడా శ్రోతలుగా మారటం జరిగి పోయింది.
రామన్న కొత్త కధ చెప్పటం మొదలెట్టాడు.
పూర్వం ఒక గురుకులం లో ఒక రాజ కుమార్తె విద్య అబ్యసించింది. కొన్ని సంవత్సరాల శిక్షణ ముగిసింది. బాలికగా వచ్చిన ఆమె యవ్వనవతి అయ్యింది. సౌందర్య రాశి అయింది. విధ్య పూర్తి అయ్యి తండ్రి వద్దకు వెళుతూ గురువు వద్దకి వచ్చింది.

గురు దక్షణ చెల్లించడానికి సిద్దమయింది.
అందుకాయన “ వచ్చే శివరాత్రి నీవు సకల రాచరికపు అలంకరణతో కాలి నడకన వచ్చి గురుకులం లో జరిగే పూజలో పాల్గొనాలి” అదే నేను నిన్ను అడిగే గురుదక్షణ అన్నాడు.
ఆమె అందుకు అంగీకరించి, నమస్కరించి వెళ్ళి పోయింది.
కొన్నాళ్ళకు ఆమెకు ఒక చక్కని రాకుమారుని తో వివాహం అయ్యింది.
బర్తతో ఆమె గురుదక్షణ విషయం చెప్పింది ”తనని శివరాత్రి రోజు కన్యగా, ఒంటరిగా, కాలినడకన రమ్మని గురువు ఆదేశం అని”
ఆ రాకుమారుడు వెంటనే ఆమె ను “గురు దక్షణ తీర్చేంత వరకు నేర్చుకున్న విధ్యకు, వినయానికి విలువ లేదు కనుక, శివరాత్రి వరకు వేచి ఉంది గురుదక్షణ చెల్లించి రావలసినది గా బార్యకి నచ్చ చెప్పాడు.
శివరాత్రి రానే వచ్చింది.
ఆమె చక్కగా తయారయింది, వజ్ర వైఢూర్యాల నగలు ధరించి ఆశ్రమానికి, ఒంటరిగా కాలి నడకన బయలు దేరింది.
మార్గ మధ్యం లో చీకటి పడింది. అయినా ఆమె నడుస్తూనే ఉంది.
ఒక గజదొంగ ఆమెని బందించాడు.. నగలు మొత్తం వలిచి ఇవ్వమని చెప్పాడు.
ఆ రాజకుమారి తను వెళ్తున్న విషయం చెప్పి ‘పూజానంతరం అదే మార్గం లో తిరిగి వస్తాను అని అప్పుడు అతను కోరిన విధంగా తన నగలు అన్నిటిని ఇచ్చేస్తానని .. తన దారి విడమని అడిగింది. మాట తప్పనని ప్రమాణం చేయిచ్చుకున్నాక అతను దారి పొడవునా తోడుగా వచ్చి గురుకులం లో దిగబెట్టాడు.
ఆశ్రమం లో పూజా కార్యక్రమం పూర్తి అయింది.
తెల్లవారుతుండగా ఆమె తిరుగు ప్రయాణం అయింది. దారిలో దొంగని కలిసింది. నగలు మూట కట్టి అతనికి ఇచ్చింది. దొంగ విచలితుడు అయ్యాడు. “తల్లీ నీ అంతటి ఉత్తమురాలి వద్ద దోచుకున్న ధనం నాకు వలదు. నన్ను మన్నించి నీవే తిరిగి అలంకరించుకొని వెళ్ళమని కోరి, నగలు తిరిగి ఇచ్చి పంపాడు.
ఇంటికి వెళ్ళిన తర్వాత బర్త తో కలిసి అన్నీ విషయాలు చెప్పి ఆమె సంతోషంగా జీవితం ప్రారంభించినది.
రామన్న చెప్పటం ముగించాడు.
“మీరంతా .. శ్రద్ధగా విన్నారు కదా? ఇప్పుడు ఈ కధలో ముగ్గురు వ్యక్తులగురించి మాట్లాడుకుందాం. 
గురుదక్షణ తీర్చిన ‘రాకుమారి’,
ఆమె గురువు కోరికను అనుమానించ కుండా ఒంటరిగా పంపిన ‘రాకుమారి బర్త’,
అందివచ్చిన నగలను తిరస్కరించిన ‘దొంగ’ వీరిలో ఎవరు గొప్పవారు?
అందరితో పాటు ముగ్గురు పాలేర్లను కూడా అడిగి సమాదానం తెలుసుకున్నాడు. విచిత్రంగా ముగ్గురూ తలా ఒక సమాదానం చెప్పారు. 
***
మర్నాటి ఉదయం రామన్న, వెంకటాద్రి గారికి ముగ్గురు పాలేర్లలో దొంగ ఎవరో చెప్పారు.
(చిన్నతనం లో విన్న కధ... కొంత మార్పులతో.. నా మాటల్లో )

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...