Sunday 29 December 2019

దేవుడు ఎప్పుడూ గుడి లోనే ఉండడు.


పాలక్కడ్ (కేరళ) లో ఉండే ఒక పందొమ్మిదేళ్ళ కుర్రాడు జయక్రిష్ణన్ మూడేళ్ళ వయసప్పుడు తల్లి తండ్రిని ఒక ప్రమాదం లో కోల్పోయాడు.
మిగిలిన పూరి ఇంట్లో నానమ్మ పిల్లాడిని చాకింది. తినీ తినకా కూలి నాలి చేసుకుని వాడిని చదివిస్తూ ఉంది. 2007 లో జయక్రిష్ణన్ తన ప్లస్ వన్ (ఇంటర్ మొదటి సంవత్సరం) చదివేటప్పుడు అతని శరీరం లో మార్పులు మొదలయ్యాయి.
అతని #కధ మొదలయ్యింది.
హటాత్తుగా బరువు పెరగటం, కాళ్ళు వాయటం, మొహం వాపు, నిద్ర లేచేసరికి కళ్ళు కనిపించక పోవటం ...
పాలక్కడ్ ప్రభుత్వ ఆస్పత్రి లో రక్త పరీక్ష చేసారు. జయక్రిష్ణన్ కి ereatinine నిల్వలు పెరుకుపోవటం (కిడ్నీ సరిగా పనిచేయక పోవటం వల్ల వ్యర్ధాలు పేరుకు పోవటం) జరిగిందని అత్యవసరం గా వైద్య సాయం అందాలని...
అప్పటికే అనాధ అయిన జయక్రిష్ణన్ చదువు ఆపేయవలసి వచ్చింది.
నాయినమ్మ తాము ఉంటున్న ఇంటిని బంధువుల వద్ద తాకట్టు పెట్టి వైద్యం చేయించడం మొదలెట్టింది.
కాని అంతంత మాత్రపు వైద్యం అతనికి ఉపయోగ పడక పోగా కాళ్ళు చచ్చుపడి నడవ లేని స్థితికి చేర్చింది.
వెంటనే డాక్టర్లు డయాలసిస్ కి అతన్ని మార్చేసి ముసలావిడకి చెప్పేశారు. #కిడ్నీ ని వెంటనే మార్చాలి. లేకుంటే అతన్ని మర్చి పోవాలి.
**
వాళ్ళ వాడ లోనే ఉండే 'విష్ణు' అనే వ్యక్తి డయాలసిస్ కి ఆర్ధిక సాయం చేసేవాడు. అదృష్ట వశాత్తు ఆతను ‘దయా చారిటబుల్ ట్రస్ట్ ‘ లో ఆక్టివ్ మెంబర్.
నిరుపేదల సాయం కోసం పని చేసే ట్రస్ట్ అది.
విష్ణు ట్రస్ట్ లో సభ్యులకి జయక్రిష్ణన్ అసహాయ పరిస్థితి తెలియపరిచాడు. వెంటనే ఆ సంస్థ జయక్రిష్ణన్ ఇంటికి చేరింది.
జయక్రిష్ణన్ వైద్యం ఖర్చులు భరాయించేందుకు ట్రస్ట్ ముందుకు వచ్చింది. జయక్రిష్ణన్ దగ్గరి బంధువులని కిడ్నీ డొనేషన్ చెయ్యమని అడిగింది. కిడ్నీ దానం చేసిన వారికి ఒక మంచి ఇల్లు నిర్మించి ఇస్తామని, మంచి ఉద్యోగం చూయిస్తామని ప్రామిస్ చేసింది.
అప్పటిదాకా బండువులం అని చెప్పుకున్న వాళ్ళు కూడా మొహం దాచేశారు.
ఏమీ చెయ్యటానికి పాలు పోనీ స్థితిలో ట్రస్ట్ మెంబర్ ఒకరు తన ఫేస్బుక్ వాల్ మీద జయక్రిష్ణన్ దీన గాధ ని వ్రాసాడు.
దేవుడు ఎప్పుడూ గుడి లోనే ఉండడు.
కొట్టాయం లో ఉండే HR ప్రొఫెషనల్ 47 ఏళ్ల శ్రీమతి 'సీత దిలీప్' ఈ పోస్ట్ చదివింది. భర్త తో తను జయక్రిష్ణన్ కి కిడ్నీ దానం చేస్తానని చెప్పింది.
ప్రతి మనిషికి తన శరీరం మీద సర్వ హక్కులు ఉంటాయి. అవయవ దానం అనేది నీ వ్యక్తిగతం. నేను అబ్యంతర పెట్టను. కాని దీనికి చాలా ఓర్పు. సహనం కావాలి. కొన్ని త్యాగాలు కూడా చెయ్యవలసి ఉంటుంది. వాటన్నిటికీ నువ్వు సిద్దపడితే నాకు ఏమాత్రం అబ్యంతరం లేదు అని చెప్పాడతను.
మరు క్షణం ఆమె తన అభిప్రాయాన్ని స్థిరంగా మరో మారు చెప్పింది.
ఆమె భర్త తో పాటు ట్రస్ట్ ని కలిసింది.
అమృత ఆసుపత్రి లో క్రాస్ మ్యాచ్ టెస్ట్ లు జరిగాయి. దాత వి పేషంట్ వి బ్లడ్, టిస్యు లు అనేక సార్లు మ్యాచ్ చేసి చూడాల్సి వచ్చింది. వయసులో చిన్న వాడయిన అబ్బాయికి కిడ్నీ ఇవ్వటానికి ఆమె తన శరీరాన్ని శ్రమ కి గురి చెయ్యాల్సి వచ్చింది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి వచ్చింది. చివరికి తన ఉద్యోగాన్ని వదిలెయ్య వలసి వచ్చింది. 2019 మే నుండి నవంబరు వరకు అనేక సార్లు క్రాస్ మాచ్ పరిక్షలు జరిగాక డిసెంబరు 10 తేది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
ఈ లోగా ట్రస్ట్ వైద్యానికి అవసరం అయిన డబ్బు ని దాతల సహకారం తో ఏర్పాటు చేసింది. ఆసుపత్రి ఖర్చులకి 8 లక్షలు మిగిలిన ఖర్చులు కలసి మొత్తం 15 లక్షలు సంస్థ సేకరించింది.
డిసెంబరు 8 తేదిన సీతా & దిలీప్ లు తమ 23 వ వివాహపు వార్షికోత్సవాన్ని ఆసుపత్రి లోనే జరుపుకున్నారు.
అనేక మంది బంధువులు, స్నేహితులు భయపెట్టినా, నిరుత్సాహ పరచినా వేటికి వెరవకుండా #సీత జయక్రిష్ణన్ కి పునర్జన్మ ని ప్రసాదించింది.
జయక్రిష్ణన్ మరో మూడు నెలలు ఆ #తల్లి #సీత తో పాటు కొచ్చిన్ లో ఉంటాడు.
పాలక్కట్ లో జయక్రిష్ణన్ & నాయినమ్మ కోసం మంచి పరిసరాల్లో ఒక చిన్న ఇంటిని ఏర్పాటు చేసే పని దయా చారిటబుల్ ట్రస్ట్ తీసుకుంది.
**
ఎవరు చెప్పారు దేవుళ్ళు గుళ్ళోనే ఉంటారని??



2 comments:

Rajeswari said...

నిజం దైవం మానుష రూపేణా,💐

Shekar said...

manchi vishayam parichayam chesaru.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...