Monday 13 February 2017

సూర్య మండలాన్ని భేదించే జవానులు

ఒకటి
చాలా ఏళ్ల క్రితం సంగతి. 
హర్యాణాలో ని ఒక కుటుంబంలో ఒక జవాను కాశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాడుతూ చనిపోయాడు.
ఆ రోజు సరిగ్గా ఆ అమర జవాను చనిపోయిన పదమూడో రోజు. జవాను చనిపోవడానికి కొద్ది రోజుల ముందే భార్య ప్రసవించింది. ఆ పిల్లవాడు పుట్టి ఇరవై ఒక్క రోజులైంది. అంతా బాగుంటే వాడిని ఆ రోజు ఉయ్యాలలో వెయ్యాలి.
కొడుకు పోయిన విషాదం.... మనవడు వచ్చిన ఆనందం....
ఓ బహు విచిత్ర భావాతీత స్థితి అక్కడ బరువుగా తిష్ఠవేసింది.
ఆ ముసలి తల్లి కూర్చుని కొడుకును తలచుకుంటూ కన్నీరు తుడుచుకుంటోంది.
అదే సమయంలో ఎవరో మనవడిని తెచ్చి ఆమె పొత్తిళ్లలో పెట్టారు.
ఆ ముసలావిడ ఒక్క క్షణం ఏడుపాపింది. ఆ మనవడిని చూసింది.
గద్గద కంఠంతో.... "బేటా.... బడా హోకర్ ఫౌజ్ మే భర్తీ హోనా...కశ్మీర్ జానా.. దుష్మనోం సే లడ్నా...." అంటూ ఆశీర్వదించింది. 
కటికపల్లెటూరు.... ఆ ముసలామెకి అక్షరం ముక్క రాదు..... చదువుకోలేదు... కానీ పెను విషాదంలోనూ మనవడిని వీర జవాను కమ్మని ఆశీర్వదించే మనసుంది. తూటాలున్నాయని తెలిసీ ఛాతీ ఎదురొడ్డించే స్థైర్యం ఉంది. మరిన్ని విషాదాలనైనా సహిస్తాననే మనో నిబ్బరం ఉంది. నా పొలం దున్నే వాడు లేకపోయినా పరవాలేదు.... దేశం సరిహద్దు భద్రంగా ఉండాలన్న భావన ఉంది. 
.
రెండు
హిమాచల్ కి వెళ్లినప్పుడు ధర్మశాల దగ్గర షాపూర్ లో ఒక గుడి ఉంది చూడండి.
ఆ గుడి ఒక జవాను స్మృతిలో కట్టింది. ఫిబ్రవరి 1994 లో ఉగ్రవాదంతో పోరాడుతూ పదిహేను తూటాలకు ఛాతీ ఎదురొడ్డి మరీ ప్రాణాలు వదిలిన 23 ఏళ్ల రాయ్ సింహ్ రాణా అనే జవాను కోసం ఆయన తల్లి అయోధ్యా దేవి కట్టించిన గుడి అది. ప్రాణాలివ్వడం ఒక వీర సంస్కృతి. ఉత్తర భారతంలో, ముఖ్యంగా హర్యాణా, పంజాబ్, హిమాచల్, ఉత్తరాంచల్, జమ్మూ, రాజస్థాన్ లలో దేశం కోసం ప్రాణాలివ్వడం ఒక సర్వోచ్చ కర్తవ్యం. మగాడు మీసం మెలేసేది అందుకే.
అయితే విజయం. లేకపోతే వీరస్వర్గం.

శాస్త్రాలు చెప్పినట్టు...
రెండు రకాల వ్యక్తులే సూర్య మండలాన్ని భేదించి ఊర్ధ్వ లోకాలకు వెళ్లగలుగుతారు.
ఒకరు యోగ పురుషులు.
రెండవ వారు యుద్ధంలో వెన్ను చూపక చనిపోయిన వారు.
ఈ వీరారాధన ఉంది కాబట్టే దేశం కాపాడబడుతోంది. దేశం రక్షింపబడుతోంది.
జై జవాన్ ! జై జై జవాన్ !!

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...