Tuesday 18 August 2015

ప్రస్థానం

(గతం లో 30 రూపాయల కోసం  వ్రాసిన కధ ఇది . కొంత మార్పు చేద్దామని అనిపించినా , ఒరిజినల్  గా అప్పట్లో నాలో ఉండే freshness మీకు యదాతదంగా అందించాలని అలానే టైప్ చేశాను. తమ్ముడు "శివ రాచర్ల" రాయలసీమ కరువు- సోమేశ్వర ఆలయం- భీమలింగం బయట పడటం  గురించి వ్రాసినప్పుడు పాతికేళ్ళ క్రితం వ్రాసిన ఈ కధ గుర్తొచ్చింది. నా బార్య చదివిన ప్రతిసారి ఏడ్చిన (ఇవాళ కూడా)  కధ ఇది. నేను గుర్తు చేయగానే తన వార్డ్రోబ్ లో దాచుకున్న మాతృక తీసి ఇచ్చింది.)
**************
ఈ ఉగాదికి నాలుగేళ్లయింది. వాన చుక్క రాలి. లోలోపలే అనుకున్నాడు ‘సవారి’ గంటకి అరవై సార్లు లెక్కన ప్రొద్దుటి నుండి అదే పనిగా ఆకాశం లోకి చూస్తున్నాడు. పడమటి దిక్కున నల్లటి మేఘం ఒకటి పైకి లేస్తూ ఉంది. సవారికి చెప్పలేనంత సంబరం గా ఉంది. 
అతడికి అప్పుడే వాన కురిసినట్లు, పగిలి నోరు తెరుచుకున్న భూమి కడుపు నిండా నీరు త్రాగి కళ కళ లాడినట్లు, పచ్చటి పైరు చేనంతా పండి నట్లు ఊహలు ఒక దాని వెంట మరొకటి వెంటాడాయి. 
సవారి ఇంటికెసి నడిచాడు.
నుకాలమ్మ పొద్దుటే తొలిపొద్దు పొడవకముందే  నీళ్ళ కెళ్లింది . చాలా పొద్దు పైకి ఎగబాకింది. తను ఇంకా రాలేదు.
ఆమడ దూరం అంటే సామాన్యమా? “మద్దేణం  దాటుద్ది “ అని సమదాయించు కున్నాడు. 
ఆ ఊరి చెరువు ఏండి పోయి చానాళ్ళయింది. త్రాగే నీరు కూడా దొరకని పరిస్తితి. ఆమడ దూరాన ఎండిన వాగు ఒడ్డున చెలమ (నీటి గుంట) తవ్వి ఉంది. ఎక్కడో అడుగున రెండు చెంబుల నీరు ఉంది. చిన్న డబ్బా ఒకదానికి తాడు కట్టి మెల్లి మెల్లిగా తోడు కోవాలి. అప్పుడప్పుడు చుట్టూ ఉన్న ఇసుక మట్టి జారి పడుద్ది. ఓపిగ్గా  
జారిన మట్టిన ఒడ్డున పోస్తుండాలి. ఇలా గంటల కొద్ది శ్రమించాక రెండు బిందెల నీళ్లొస్తాయి. ఆ చలమయినా ఎన్నాళ్లు ఊరుద్దో ఎవరికి తెలీదు. అది గొడ్డు పోయాక  మళ్ళీ ఎక్కడో ? ఎంత దూరానో ? అన్వేషణ మొదలు. 
రోజు సవారి కావిడి వేసుకుని నీళ్ళ కేళ్ళేవాడు. ఈ పొద్దు ఊళ్ళోకి యాపారం మనుషులు వస్తే బర్రెని అమ్మేయ్యాలనే నిలబడ్డాడు. సవారికి మంచి పాడి బర్రె ఉంది. మంచి దాణా పెట్టి , కుదితి తాపితే రోజు అయిదారు లీటర్లు పిండుద్ది. అలాటి గొడ్డు చిక్కి శల్యమయింది. దానికి గడ్డి లేదు, తాగను కుడితి లేదు . అటు చావకుండా ఇటు బతకలేక అస్తిపంజరం మల్లె ఆ ఇంటి ముందు పడుకుని ఉంది. సవారి కుటుంబ పరిస్తితి కూడా సరిగ్గా అలానే ఉంది. రెండేళ్లుగా భూమి బీటలు వారి ఉంది. మచ్చుకి ఒక జల్లు కురిసిన జ్ణపకం  లేదు. బొటా బొటి రాబడి ఉండే పొలం బీడు పెట్టవలసి వచ్చింది. 
చాన్నాళ్ళ క్రితం ప్రభుత్వం తవ్విన ‘ కాలవలు’ అలాగే ఉండిపోయాయి . పైసలు లేక ఆగిపోయిన కాలువ పని పూర్తయి పంట కాలవలో నీరు పారతాయన్న ఆశ ఎవరికీ లేదు .
పోయిన సంవత్సరం చెరువులో నీరు తెచ్చి జాగర్తగా గుమ్మడి పాది  పెంచాడు సవారి. బూడిద పూసిన గుమ్మడికాయలు మచ్చు  మీద దాచాడు. ఆకలి తీర్చు కోటానికి ఏమి దొరకనప్పుడు ఆ గుమ్మడి గుజ్జును ఉప్పు కలిపి నూరుకోని తిని, ఇన్ని నీళ్ళు త్రాగి పడుకునే వారు. సవారి మొన్న మొన్నటి వరకు దగ్గరలో ఉన్న పట్టణానికి పోయి రిక్షా లాగేవాడు. అక్కడ కూడా కరువు బాదితున సంఖ్య పెరిగి రిక్షా బాడుగ కూడా దొరకని పరిస్థితిలో ఇంటి కొచ్చాడు. రెండు రోజుల క్రితమే చివరి గుమ్మడి కాయ తినేశారు. అప్పటి నుండి మరేం లేదు. ఖాళీ కడుపులు కనీసం గొంతు తడుపుకోవటానికి నీటి చుక్క కూడా లేదు.  సవారికి ఎవరో బలీయంగా లోపలికి నోక్కెస్తున్నట్టు అనిపించింది. అతనికి  పాడి బర్రె అమ్మడం సుతారాము ఇష్టం లేదు. ఎటొచ్చీ అదీ ఏదో ఒక రోజు ఇంటి ముందే చచ్చి పోద్దని తెలుసు. అతడు ఉదయం నుండి అమ్మేయటమా మానేయటమా అనే సంధిగ్దంగా ఉన్నాడు.
ఇంట్లోకి నూకలు కూడా అవసరమే. ఎన్నాళ్లని పస్తులుంటారు. ఇన్నాళ్లు నుకాలమ్మ చేవి పోగులు, మంగళ సూత్రం, బిందెలు లాటివి అమ్ముకుని గడిపారు. ప్రస్తుతం సవారికి అమ్ముకోటానికి మరేమీ లేదు. ఆ ఇంట్లో అమ్ముకోదగినది ఏదయినా ఉంటే అది గోడ్డే. సవారి ఆశగా ఎదురుచూస్తున్నాడు. ‘ఆళ్ళ’ లారీలో వస్తారని వెంకట నారాయణ పొద్దుటే చెప్పాడు. 
సవారి ఆలోచనలని విడగొడుతూ ‘అమీన ‘ మెల్లగా ములిగింది. అమీన సవారికి ఉన్న తొమ్మిదేళ్ల ఏకైక కూతురు .గుడిసెలో ఒక మూలగా పడుకుని వుంది. మూడు రోజుల నుండి విరోచనాలు అవుతున్నాయి. లంఖనాలు చేసి నట్లు ముఖమంతా నీరసంగా ఉంది.
రాత్రి నూకలమ్మ పాత తువ్వాలు ఒకటి ‘అమీన’ కడుపుకి బిగదీసి కట్టింది. మోకాళ్ళు డొక్క లోకి ముడిచి  పెట్టుకుని  ఆ పిల్ల  రాత్రి నుండి అలాగే నిస్త్రాణంగా పడుకునుంది.
‘అమ్మీ....’ సవారి నెమ్మదిగా పిలిచాడు. నుదుటి మీద చేయి వేస్తే , నుదురు మద్యాహ్నం బొడ్డు రాయిలా  ఉంది. ఆమె కళ్ల లోకి సవారి ఏమి చాతగాని వాడిలా జాలిగా చూశాడు. అతడి గుండె బరువెక్కింది. ఒక్కగానొక్క బిడ్డకి గుప్పెడు మెతుకులు పెట్టుకోలేని యాదవ బతుకు ఛీ ! అనుకున్నాడు.
అమీన కళ్ళు నీరసంగా మూసుకు పోయాయి . ఆ నీరసపు కళ్ల వెనుక అసలు కారణం సవారికి తెలుసు .
సవారి గుడిసెలోంచి బయటకి వచ్చాడు . పడమటి దిక్కున మబ్బులు క్రమీణా వీడి పోతున్నాయి. 
దూరంగా లారీ ఒకటి దుమ్ము లేపుకుంటూ వస్తుంది. నుకాలమ్మ కాలిబాట వెంబడి నడిచివస్తు కనబడింది. చంకలో ఒకటి తల మీద రెండు కుండలు.
జాగర్తగా అడుగులో అడుగేస్తు నడుస్తుంది. ఆమె ముఖంలో అలసట స్పస్టంగా కనిపిస్తుంది. అలసటని మించి నీరసం ఆమెని వణికిస్తుంది. సవారి గబగబా ఎదురెల్లాడు. చంక లో బిందె అందుకున్నాడు. తల్లి ని చూస్తూనే అమీన పలకరింపుగా కళ్లు తెరిచింది. నుకాలమ్మ గ్లాసు నిండా నీరు నింపుకుని కూతురి దగ్గర కెళ్లింది. నుదుటి మీద జుట్టు సరిచేస్తు ‘అమీనా’ అని పిలిచింది. 
‘అమ్మి... రెండు గుక్కలు తాగవే మంచి నీళ్ళు ‘అంది. నుకాలమ్మ కూతుర్ని మెల్లిగా లేపి కూర్చోబెట్టింది. మెల్లిగా రెండు గుక్కలు త్రాగే సరికి భళ్ళు మని  వాంతి అయింది . విరోచనమయి బట్టలు పాడు చేసుకుంది. కళ్ళు భావ రహితంగా నిలబడి పోయాయి.
“ అతిసార” అని తెలుస్తూనే ఉంది. కానీ రోజుకో పుట కూడా తిండి పెట్టలేని కుటుంబానికి వైధ్యుడి ని కలిసే స్థోమత ఉండదు.
“ మావా అమిన పలకట్లేదు .. నాకు బయంగా ఉంది .. ఇట్రా “ నుకాలమ్మ గావు కేక పెట్టింది.
’ ఏమైనాదే?’ అంటూ సవారి పరుగెత్తు కొచ్చాడు .
‘అమ్మీ , అమ్మీ’ కూతుర్ని కదుపుతూ పలకరించింది నుకాలమ్మ. అచేతనమయిన కూతురు మాట్లాడలేదు . 
నుకాలమ్మ మొగుడు ముఖం లోకి కూతురు ముఖం లోకి భయం భయం గా చూసింది. 
ఆచారి గారింటికి తీశక పోవే నేను వస్తుండా అంటూ లేచాడు సవారి. “ఆయన కాసులడుగుతాడు మావా..కాసులు లెండే చెయ్యి కూడా పట్టుకోడు .ఇంకా మందేవిత్తాడు” బావురు మంది నుకాలు .
“నువ్వు పదవే... కాసులు నేను తెస్తాను” సవారి బయటకి నడిచాడు .
నుకాలమ్మ కూతుర్ని బుజాన వేసుకుని ఊళ్ళోకి పరిగెత్తింది . 
సవారి బక్కచిక్కిన ముసలి బర్రె భారంగా నడుస్తోంది. ఎక్కడ కులి పోతుందో అన్నట్టు దీనంగా అడుగులేస్తుంది. ఊరి పొలిమేర కొచ్చాక అక్కడ ఆగి ఉన్న లారీ దగ్గర మెడకి మఫ్లర్ చుట్టుకుని, చుట్ట పీలుస్తూ ఓ మడిసి నిలబడి ఉన్నాడు. లారీ చుట్టూ బక్క చిక్కిన పశువులు కట్టేసి ఉన్నాయి. వాటిని లారీ లోకి ఎక్కించే ప్రయత్నం లో నాలుగురు  మడుసులు తీరిక లేకుండా ఉన్నారు. 
గొడ్డు ని అమ్ముతావా?” మఫ్లర్ మడిసి దగ్గరగా వచ్చి అడిగాడు. సవారి అవునన్నట్లు తల ఉపాడు. 
“ఎంతకిస్తావు ?”
“నువ్వే చెప్పు సావీ .. బీదాడిని బిడ్డ పేణం కోసం అమ్ముకుంటుండా .. “ సవారి దీనంగా అడిగాడు.
బాగా మాసిన తుండు తో ముఖం తుడుచుకుంటున్నాడు . తన దుఖం  మరొకరు గమనించడం ఇష్టం లేదు సవారికి .
చుట్ట మనిషి కి ఇలాటివి సహజం . చేయి వంచి ఒక వంద రూపాయల నోటు తీశాడు .
“ఒక్క వందా?” ఆశ్చర్యంగా అడిగాడు సవారి .
“మరి ఎంతొత్తదనుకున్నావు ? యాబయ రూపాయలకి కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు, నీ ఇష్టం” వాడి బెదిరింపు.
నాలుగు సంవత్సరాల క్రితం మూడు వేలు పోసి కొన్న జీవం . వంద రూపాయలకి అమ్ముకోవటం .. సవారి ఈ సారి తుండు గుడ్డతో ముఖం తుడుచుకోవటం మర్చిపోయాడు . మౌనంగా వంద అందుకుని పలుపు తాడు ఆ మడిసికి ఇచ్చి వెనక్కి తిరగబోతూ ఆగి అడిగాడు “ ఏం చేస్తారు బాబు ఈ గొడ్డుని?”
చుట్ట మొదలు కోరుక్కుంటూ అతను చెప్పాడు “   మద్రాసు కాబేళాలకి (మాంసం కొట్టు) తోలుతాం. సవారి అక్కడ ఉండలేనట్టు బయలు దేరాడు.
చుట్ట మడిసి బుజాన చేయి వేసి ఆపాడు . “మేమేదో అన్యాయం చేత్తున్నామని బాద పడోద్దు . కేజీ గొడ్డు మాంసం రూపాయి మార్కెట్ లో లారీ ఖర్చులు లాటివి పోను మాకు కూలికి మించి గిట్టదు” మరో పది నోటు సవారి జేబులో ఉంచాడతాను.
&&&&&&&
పగలు కాలి సంధ్య ముసురుకుంది. 
సవారి, నుకాలమ్మ దయ్యాలా నడుస్తున్నారు. 
బ్రతుకున్న శవాల లా కదులు తున్నారు . 
వారి ముఖాల్లో జీవ కళ లేదు. కళ్ళు పేలవంగా ఉన్నాయి.
 సవారి భుజం మీద అమీన  ‘శవం’  ఉంది . 
దూరంగా లారీ లోకి పశువులు ఎక్కిస్తున్నారు.
ఎక్కువ పశువులు రవాణా చేయటం కోసం వాటి కాళ్ళు లావు పాటి కర్ర తో విరగ్గొడుతున్నారు.
శరీరం లో ఓపిక అంతా కుడ్చుకుని అవి దారుణంగా  అరుస్తున్నాయి.
ఆ దృశ్యం హృదయ విదారకంగా ఉంది. 
ఎక్కడుందో తెలియని ప్రభుత్వం పైసలిచ్చి కాలువ పని చేయించుద్ది అనే ఆశ సవారి మదిలో ఏండి పోయింది.
ఆ జంట కనుకొనకల వద్ద మాత్రం హిమాలయం కరుతూనే ఉంది.
 (1990 కోస్తావాణి , రాజమండ్రి )

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...